రామోజీరావు అతిపెద్ద అవినీతిపరుడు: ధర్మాన

రామోజీరావు అతిపెద్ద అవినీతిపరుడు: ధర్మాన


శ్రీకాకుళం:’పేదలకు చెందిన వేలాది ఎకరాలు ఆక్రమించి ఫిలింసిటీ కట్టిన ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావుకంటే అవినీతిపరులు రాష్ట్రంలో వేరెవరూ లేరు. అలాంటి ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్న మమ్మల్ని అవినీతిపరులు అని విమర్శించడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబును సీఎం చేయడానికి ఆయన తన పత్రికలో అడ్డగోలుగా అసత్య వార్తలు రాయిస్తున్నారు’ అని మాజీమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఘాటుగా విమర్శించారు.




శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రామోజీరావు అవినీతిని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి అసెంబ్లీలోనే ఎండగట్టాం. అందుకే మేమంటే ఆయనకు అక్కసు. ప్రజలు మావైపే ఉన్నారని ప్రతి ఎన్నికల్లోనూ నిరూపించారు. నేనూ, నా సహచరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరితే ఇక శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి నూకలు చెల్లిపోతాయి. అందుకే మళ్లీ నాపై ఈనాడు పత్రికలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారు. ఈనాడు కుట్రలను ప్రజలు తిప్పికొడతారు’ అని అన్నారు.



వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ 10 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గంలోనూ విజయం సాధిస్తుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజలు రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడతారు అని ధర్మాన స్పష్టం చేశారు. ఈ నెల 9న నిర్వహించనున్న సిక్కోలు తిరుగుబాటు బహిరంగ సభ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top