ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూజారికాంకేర్లో గత నెల 10న రాత్రి పొడియం కోసాను పోలీసులు అక్రమంగా అదుపులోనికి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్ విమర్శించారు.
చర్ల, న్యూస్లైన్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూజారికాంకేర్లో గత నెల 10న రాత్రి పొడియం కోసాను పోలీసులు అక్రమంగా అదుపులోనికి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్ విమర్శించారు. కోసాను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రికలకు ఒక లేఖ పంపారు. గ్రామానికి చేరుకున్న వందలాది మంది పోలీసులు ఇంట్లో నిద్రిస్తున్న పొడియం కోసాను అక్రమంగా అదుపులోనికి తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన గిరిజన మహిళ పొజ్జె ఇంటిపై దాడి చేసి రూ. 12 వేల నగదును ఎత్తుకు పోయారని ఆరోపించారు. అన్నెం పున్నెం ఎరగని ఆదివాసీలను, రెక్కాడితే గానీ డొక్కాడని అడవి బిడ్డలను వేధిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివాసీలను చంపి వారి ప్రాంతంలో ఉన్న వనరులు, ఖనిజ సంపదలను సామ్రాజ్యవాద, బడా కంపెనీలకు ధారదత్తం చేసేందుకు ప్రభుత్వాలు పూనుకున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో ఆదివాసీలను వేధింపులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ఆదివాసీలను నయానా, భయానాకు గురి చేసి వారి ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే అక్రమ అరెస్టులు, కేసులు, ఎన్కౌంటర్లు, జైలు తదితర దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న కోసాను వెంటనే విడుదల చేయాలని, పొజ్జె ఇంటి నుంచి తీసుకెళ్లిన నగదును తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు.