స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు.
ఎమ్మిగనూరురూరల్, న్యూస్లైన్ :స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. అధ్యాపకులపై తిట్ల దండకం అందుకున్నాడు. అతన్ని చూసి విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. నందవరానికి చెందిన శాంతమ్మ కుమారుడు నరసింహులు ఆటో తోలుతూ కుటుంబానికి ఆధారంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఇతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించారు.
వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్న ఇతడు పది రోజులుగా వేసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రమైంది. ఈ క్రమంలో వారం క్రితం ఆటోను ఆదోనికి తీసుకెళ్లిన ఇతడు అక్కడ యాక్సిడెంట్ చేశాడు. తర్వాత బండి మానుకుని ఎటుపడితే అటు తిరుగుతున్నాడు. సోమవారం బాలికల జూనియర్ కాలేజీలోకి ప్రవేశించాడు. తరగతి గదిలో లెక్చరర్పై తిట్లు మొదలెట్టాడు. ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులను కూడా నోటికి వచ్చినట్లు తిడుతుండడంతో అందరూ కలిసి గదిలో పెట్టి తాళం వేశారు. వారి సమాచారం మేరకు కానిస్టేబుల్ రఘు, హోంగార్డులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాడు. అయితే స్థానికుల సహకారంతో పోలీసులు అతనికి దేహశుద్ధి చేసి స్టేషన్కు తరలించారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపారు.