మరో వడ్డన! | Property tax will grow large in villages | Sakshi
Sakshi News home page

మరో వడ్డన!

Nov 6 2013 3:34 AM | Updated on Sep 2 2017 12:18 AM

గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు పన్నులు పెంచాల్సిం దేనన్న నిర్ణయానికి వచ్చేసింది. పన్నులను ఎలా సవరించాలన్న విషయమై పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్ర అధికారులతో అధ్యయనం చేయిస్తోంది. నెలరోజులుగా అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ పంచాయతీల ఆదాయ వనరులపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలకు నిధులు సరిపోవడం లేదని, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిం చాలంటే పన్నులు పెంచాల్సిందేనని వారు గుర్తించి నట్లు సమాచారం. 15 ఏళ్లుగా పన్నులను సవరించలేదని, గ్రామాల అభివృద్ధికోసం పన్నులు పెంచాల్సిందేనని వారు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పన్నుల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని భావిస్తున్నారు. ఆస్తి పన్ను భారీగా పెరగొచ్చని తెలుస్తోంది.
 
 50 శాతం పెరగొచ్చు
 పన్నుల పెంపు భారం మేజర్ పంచాయతీలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 718 పంచాయతీలుండగా ఇందులో 74 మేజర్ గ్రామ పం చాయతీలున్నాయి. ఇందులోనూ 10 వేలకుపైగా జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు 17 ఉన్నాయి. 15 ఏళ్లుగా పన్నులు పెంచలేదని, ఇన్నేళ్లలో భూములు, ఆస్తుల వి లువ భారీగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంటోంది. పన్నులు పెంచితే గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలంగా నిధులు ఉంటాయని భావిస్తోంది. 15 ఏళ్లలో పెరిగిన అస్తి విలువ ప్రకారం పన్నులను పెంచడానికి కసరత్తు చేస్తోంది. సుమారు 50 శాతం ఆస్తి పన్ను పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

మేజర్ గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో హోర్డింగ్‌లపై పన్ను, వ్యాపార సంస్థలపై పన్ను, ఖాళీ స్థలాల వినియోగంపై పన్ను, వినోద పన్ను, సెల్ టవర్‌పై పన్ను, మార్కెట్ వేళాల పన్నులు, లెసైన్సు పన్నులు పెరగనున్నట్లు సమాచారం. నీటి పన్ను కూడా పెంచుతారని తెలుస్తోంది. తాగు నీటి పంపిణీకి అయ్యే నిర్వహణ ఖర్చును రాబట్టుకునే విధంగా మాత్రమే చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. పన్నుల పెంపుపై ప్రజలకు నచ్చజెప్పే బాధ్యత సర్పంచ్‌లకే అప్పగిస్తారట!
 
 పెంపు ఉత్తర్వులు ఇంకా అందలేదు
 -సురేశ్‌బాబు, డీపీఓ
 గ్రామ పంచాయతీల్లో త్వరలో పన్నులు పెంచుతారని తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఉత్తర్వులు వచ్చాకే ఏ పన్ను ఎంత పెరిగిందన్న తెలుస్తుంది.
 
 ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు
 పన్నులు పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగాయి. ఆస్తిపన్ను పెంచితే పంచాయతీ లకు ఆదాయం సమకూరినా.. ప్రజలపై భారం పడుతుంది. పన్నులు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.
 -గాడి లింగం, సర్పంచ్,బీబీపేట, దోమకొండ
 
 పేదలను దృష్టిలో ఉంచుకోవాలి
 పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పన్నులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి.
 -మామిడి రవీందర్‌రెడ్డి, సర్పంచ్, పొందుర్తి, భిక్కనూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement