సమస్యల తోరణం | Problems Arcade | Sakshi
Sakshi News home page

సమస్యల తోరణం

Feb 13 2014 3:07 AM | Updated on Sep 27 2018 5:46 PM

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీభ్రమరాంబాదేవి సువర్ణగర్భాలయ విమాన గోపురానికి బుధవారం విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతీస్వామి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్

 శ్రీశైలం, న్యూస్‌లైన్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీభ్రమరాంబాదేవి సువర్ణగర్భాలయ విమాన గోపురానికి బుధవారం విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతీస్వామి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ శృంగేరీ పీఠాధిపతి శ్రీభారతీతీర్థ మహాస్వామివారు నిర్ణయించిన సుమూహుర్తం వేళ మహాసంప్రోక్షణ క్రతువు జరిగింది. కార్యక్రమానికి ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో పుణ్యనదీ జలాలతో ప్రత్యేక రుద్రాభిషేకాలను అర్చకులు, వేదపండితులు చేశారు. యాగపూర్ణాహుతి సంకల్పంలో భాగంగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, జనులందరూ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని  చెప్పారు.
 
 అనంతరం పూర్ణాహుతి ద్రవ్యాలకు షోడశోపచార పూజలను నిర్వహించారు. నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నవరత్నాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతన వస్త్రాలను హోమగుండానికి ఆహుతిగా సమర్పించారు. ఆ తరువాత అమ్మవారి విమానగోపురానికి విశాఖ శారదపీఠాధిపతి చేత మహాసంప్రోక్షణ జరిపించారు. సువర్ణగర్భాలయ విమానగోపురంపై క్రతువు ముగిశాక ప్రధాన కలశంలోని జలం, 108 కలశాలలో ఉన్న సప్తనదీజలాలు, సముద్రజలాలు, సప్తమృత్తుకలతో కలిపి అమ్మవారిని అభిషేకించారు. అలాగే సహస్ర కలశాలలో ఉన్న అభిమంత్రిద జలాలను భక్తులు అమ్మవారి ఆలయంలోకి తీసుకురాగా, ఆలయ అర్చకులు ఆ జలంతో అమ్మవారిని అభిషేకించారు.
 
 కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, దేవాదాయశాఖ మంత్రులు ఏరాసుప్రతాపరెడ్డి, రామచంద్రయ్య, ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, సభ్యులు ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, సురేష్‌యాదవ్, సముద్రాల కృష్ణమూర్తి, శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకులు బుడ్డాశేషారెడ్డి, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, దేవస్థానం స్థపతి వేలు పాల్గొన్నారు. యాగబ్రహ్మ, ప్రముఖ ఆగమశాస్త్ర పండితులు గంటి నరసింహ ఆధ్వర్యంలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వేదపండితులు, 62 మంది రుత్విక్కులతో ఈ క్రతువు జరిగింది. కార్యక్రమానంతరం పీఠాధిపతి తన అనుగ్రహభాషణాన్ని చేస్తూ శ్రీశైలమహాక్షేత్రంలో చాలా ఏళ్ల తరువాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇందుకోసం కృషి చేసిన ఈఓ శీలం సూర్యచంద్రశేఖర అజాద్‌పై ప్రశంసజల్లులు కురిపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నీలాపనిందలు పడవల్సి వస్తుందని, వాటన్నింటిని తట్టుకుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసినప్పుడే వారి కీర్తిప్రతిష్టలు చిరకాలం వర్ధిల్లుతాయన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement