మారిన ప్రీ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌

Pre Public Exams Schedule Changed in East Godavari - Sakshi

7 నుంచి 12 వరకు ఎఫ్‌ఏ–4 పరీక్ష

18 నుంచి మార్చి 2 వరకు పది ప్రీ పబ్లిక్‌ పరీక్షలు

రాయవరం (మండపేట): పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఫీవర్‌ ప్రారంభమైంది. ఇప్పటికే విద్యార్థులను సన్నద్ధం చేసే పనిలో ఉపాధ్యాయులున్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. పది పబ్లిక్‌ పరీక్షలకు సన్నాహకంగా నిర్వహించే ప్రీ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేందుకు ముందుగా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే పరీక్షల షెడ్యూల్‌ను మార్పు చేసి, కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఫిబ్రవరి 18 నుంచి ప్రీ పబ్లిక్‌ పరీక్షలు
ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ విడుదల చేసింది. ముందు షెడ్యూల్‌లో రోజుకు రెండు పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించ గా, మారిన షెడ్యూల్‌లో రోజుకు ఒక పరీక్ష నిర్వహిం చాలని నిర్ణయించారు. 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, కాంపోజిట్‌ కోర్సు, 19న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, కాంపోజిట్‌ కోర్సు పేపర్‌–2, 20న హిందీ,  21న ఇం గ్లిషు పేపర్‌–1, 22న ఇంగ్లిషు పేపర్‌–2, 23న గణితం పేపర్‌–1, 25న గణితం పేపర్‌–2, 26న జనరల్‌ సైన్స్‌ పేపర్‌–1, 27న జనరల్‌ సైన్స్‌ పేపర్‌–2, 28న సోషల్‌–1, మార్చి ఒకటిన సోషల్‌–2, మార్చి 2న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు.

కొత్త షెడ్యూల్‌పై అసంతృప్తి
ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌పై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజుకొక పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం తక్కువుగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే జిల్లా కార్యాచరణ ప్రణాళికలకు కొంత అవరోధం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.  

68,778 మంది విద్యార్థులు
జిల్లాలో జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్‌ తదితర యాజమాన్యాలకు సంబంధించిన 1,285 పాఠశాలలకు చెందిన 68,778 మది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరంతా ప్రీ పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే సమ్మెటివ్‌ పరీక్ష ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా సీ,డీ గ్రేడ్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజు ఒక మార్కు ప్రశ్నలు, బిట్‌ బ్యాంక్‌పై పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

రేపటి నుంచిఫార్మేటివ్‌–4 పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫార్మేటివ్‌–4 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం తెలుగు, గణితం, 8వ తేదీ ఉదయం ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు హిందీ, మధ్యాహ్నం ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు జనరల్‌ సైన్స్, ఎనిమితి, పది విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌ పరీక్షలు, 11వ తేదీ ఉదయం ఇంగ్లిషు, మధ్యాహ్నం సోషల్‌ పరీక్షలు జరగనున్నాయి. 6,7,8 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, తొమ్మిది, పది విద్యార్థులకు ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 వరకు ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా కామన్‌ ఎగ్జామ్‌ బోర్డు నుంచి పరీక్షా పేపర్లు ఎమ్మార్సీ కార్యాలయాలకు చేరుకున్నాయి.

షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తాం
ప్రభుత్వ పరీక్షల విభాగం అందించిన షెడ్యూల్‌ ప్రకా రం పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో ఉన్న పాఠశాలలకు ప్రీ పబ్లిక్, ఫార్మేటివ్‌ పరీక్షల షెడ్యూల్‌ను అందజేశాం.
– డి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి,డీసీఈబీ, కాకినాడ

పబ్లిక్‌ పరీక్షలుగానే భావించాలి
ప్రీ పబ్లిక్‌ పరీక్షలను పబ్లిక్‌ పరీక్షలగానే భావించి వి ద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలి. ప్రీ పబ్లిక్‌ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమైతే పబ్లిక్‌ పరీక్షలు సులువుగా ఎదుర్కొనేందుకు వీలుంటుంది.
– ఎస్‌.అబ్రహాం, డీఈఓ, కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top