ఆధార్ కార్డు ఉండాలి... దాన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి. వార్డెన్ దగ్గర వేలిముద్రలు ఇవ్వాలి... అవి ఆధార్ కార్డులో ఉన్న వేలిముద్రతో సరిపోలాలి.
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డు ఉండాలి... దాన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి. వార్డెన్ దగ్గర వేలిముద్రలు ఇవ్వాలి... అవి ఆధార్ కార్డులో ఉన్న వేలిముద్రతో సరిపోలాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.... ఫోటో, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి... ఇతర స్కాలర్షిప్లు పొందటం లేదని డిక్లరేషన్ ఇవ్వాలి... వీటన్నింటిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి... ఆ తర్వాత బీసీ హాస్టల్ వార్డెన్కు పంపాలి. వేలిముద్రలను ఆయన తనిఖీ చేసిన తర్వాత జిల్లా అధికారికి పంపాలి!
దరఖాస్తుకే రూ.500 ఖర్చవుతుంది!
ఈ సవాలక్ష నిబంధనలన్నీ ఎందుకో తెలుసా? ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి చదివే బీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం విధించిన షరతులివీ. నెలకు రూ.50 చొప్పున పది నెలల పాటు అంటే రూ.500తో పాటు అడహాక్ గ్రాంటు కింద మరో రూ.500 మొత్తం కలిపి ఏడాదికి రూ.1000 ఇచ్చేందుకు విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలివి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ స్కాలర్షిప్లు పొందేందుకు ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ శుక్రవారం ఉత్తర్వుల్లో పేర్కొంది. బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.44,500 మించకూడదని, కచ్చితంగా ఆధార్కార్డు ఉన్న విద్యార్థులే దరఖాస్తుకు అర్హులని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఎంపీపీ, జడ్పీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు. మీసేవా కేంద్రం నుంచి పొందిన ద్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి బ్యాంకు ఖాతా(మైనర్ అయితే తల్లితండ్రులతో కలిసి జాయింట్ అకౌంట్), ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. విద్యార్థులకు ఏడాది మొత్తం కలిపి ఇచ్చే రూ.1000 స్కాలర్షిప్ కోసం ఇన్ని నిబంధనలు విధించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలంటేనే కనీసం రూ.500 ఖర్చు అయ్యేటట్టు ఉందని, ఇక ఈ పథకం విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.