నిరుపేద గిరిజనం | Poor girijanam | Sakshi
Sakshi News home page

నిరుపేద గిరిజనం

Jul 30 2014 11:42 PM | Updated on Jul 11 2019 5:01 PM

విశాఖ ఏజెన్సీలో అభివృద్ధి జాడలు కానరావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పడి 38 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ మారుమూల గూడేల్లోని వారి జీవనంలో మార్పు కానరాదు.

  •  పేదరికం గుప్పెట్లో మన్యం
  •  ప్రయోగాల పేరుతో నిధులు వృథా
  •  ఐటీడీఏకు 38 ఏళ్లు
  •  వ్యయం వేలకోట్లు
  •  అయినా బాగుపడని ఆదివాసీ బతుకులు
  • విశాఖ ఏజెన్సీలో అభివృద్ధి జాడలు కానరావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పడి 38 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ మారుమూల గూడేల్లోని వారి జీవనంలో మార్పు కానరాదు.  రోడ్లు, రక్షిత తాగునీరు, విద్య, వైద్య వంటి మౌలిక వసతులకు దూరంగానే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన ‘పేదరిక సూచిక’దీనికి అద్దం పడుతోంది. రాష్ట్రంలోని116 మండలాల వివరాలు ప్రకటించగా, వాటిలో జిల్లాలోని పెదబయలు మండలం అత్యంత వెనుకబడి ఉండడం విశేషం. తర్వాత స్థానాల్లో జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాలు ఉన్నాయి. ఇది మన్యంలోని దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది.  
     
    పాడేరు: ఏజెన్సీ11 మండలాలు పరిధిలోని 3,574 గిరిజన గ్రామాలతోపాటు, సబ్ ప్లాన్ మండలాల్లోని గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ 1975లో ఏర్పడింది. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  గిరిజనుల కోసం రూ. వందల కోట్లు కేటాయిస్తున్నాయి. నాబార్డు, ప్రపంచబ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు కూడా గిరిజనుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాల అమలుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కలగానే మారింది. ఐటీడీఏకు పీవోలుగా వస్తున్న అధికారులు గిరిజనాభివృద్ధికి ప్రయోగాలతో నిధులను వృథా చేయడం తప్పా ఎలాంటి ప్రగతిని సాధించ లేకపోతున్నారు. తొమ్మిదేళ్లుగా ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు తగ్గింది.

    అంతకు ముందు ఐఫాడ్ తదితర నిధులు పుష్కలంగా ఉండేవి. ఏ పీవో ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా అంచనా వేయడానికి కూడా వీలుండేది కాదు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర ముఖ్యమైన కార్యక్రమాలకు ఇప్పటికి సుమారు రూ. వెయ్యి కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. కానీ ఈ రంగాల్లో ప్రగతి కానరాలేదు. సుమారు 1500 గ్రామాల గిరిజనులకు సురక్షిత తాగునీరు కరువైంది. గిరిజనులు తరచూ రోగాల బారిన పడేందుకు కలుషిత నీరే కారణమని అధికారులకు తెలిసినా సమస్య పరిష్కారం కావడం లేదు.

    మారుమూల ప్రాంతాల రోడ్లు ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. కాలినడకతోనే తెల్లారుతున్న దుస్థితి నెలకొంది. వ్యవసాయరంగానికి రూ. వందల కోట్లు ఖర్చు పెట్టినా వర్షం పడితేనే పంటలు దక్కే పరిస్థితి. సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందలేదు. విద్య, వైద్యరంగాల్లో కూడా నిర్లక్ష్యం కొట్టొస్తోంది. ఇప్పటికి ఐటీడీఏకు వి.వినయ్‌చంద్‌తో కలిసి మొత్తం 49 మంది ప్రాజెక్టు అధికారులు పని చేశారు. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కానరాలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement