విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు.