భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్ | pil on bhogapuram airport in high court | Sakshi
Sakshi News home page

భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్

Aug 8 2015 6:06 PM | Updated on Aug 31 2018 8:24 PM

విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

హైదరాబాద్: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement