జగన్ ధర్నా అన్నపుడే రుణమాఫీ గుర్తుకొస్తుందా? | Perni nani slams chandrababu Naidu | Sakshi
Sakshi News home page

జగన్ ధర్నా అన్నపుడే రుణమాఫీ గుర్తుకొస్తుందా?

Dec 4 2014 1:24 AM | Updated on Sep 3 2019 8:50 PM

జగన్ ధర్నా అన్నపుడే రుణమాఫీ గుర్తుకొస్తుందా? - Sakshi

జగన్ ధర్నా అన్నపుడే రుణమాఫీ గుర్తుకొస్తుందా?

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా కార్యక్రమం ప్రకటించినపుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూ, ఆయన మంత్రులకూ రైతుల రుణమాఫీ అంశం..

బాబుపై ధ్వజమెత్తిన పేర్ని నాని
పూటకో మాట చెప్పి రైతులను ఏమార్చాలని చూస్తున్నారు
రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అయ్యేదాకా పోరాడతాం

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా కార్యక్రమం ప్రకటించినపుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూ, ఆయన మంత్రులకూ రైతుల రుణమాఫీ అంశం గుర్తుకు వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ‘బ్యాంకులకు ఒక్క పైసా కూడా రుణాలు చెల్లించొద్దు, నేను అధికారంలోకి రాగానే మీ ఇంటి పెద్ద కొడుకుగా వాటన్నింటినీ రద్దు చేస్తాను. తాకట్టులో ఉన్న మహిళల నగలన్నింటినీ ఒక పెద్దన్నయ్యలాగా రుణం క ట్టకుండానే మీ ఇంటికి చేరుస్తాను’ అని ఎన్నికలపుడు పదే పదే చెప్పిన చంద్రబాబు, ఆయన మంత్రులు అధికారంలోకి వచ్చాక పూటకో మాట చెప్పి రైతులను ఏమార్చే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రుణాల మాఫీపై ధర్నా చేస్తామని జగన్ ప్రకటించగానే చంద్రబాబు, ఆయన మంత్రులు రైతులను వంచించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
 
  మా అధ్యక్షుడు ధర్నాలు చేస్తామని ప్రకటించినపుడే వారికి రైతుల రుణమాఫీ గుర్తుకొస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జపాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే రుణాల మాఫీ చేస్తారని మంత్రులు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఆయన రాగానే ‘ఇంకా రుణాల మాఫీ జరగలేదా...?’ అని మంత్రులపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన హావభావాలన్నీ వివిధ టీవీ చానెళ్లు రకరకాలుగా చూపించడం నాటకీయంగా ఉందని ఎద్దేవా చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 87 వేల కోట్ల రుణాలుండగా... రాష్ట్రంలో నిజమైన రైతులు 43 లక్షల మందేనని తేల్చి, రైతు రుణాలను ఏ 5 వేల కోట్లో, పది వేల కోట్ల రూపాయలకో పరిమితం చేసేలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యల రైతులు, ట్రాక్టర్లు, ఉద్యానవన పంటలకోసం తీసుకున్న రుణాలను మాఫీ పరిధి నుంచి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి పూర్తిగా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అయ్యేంతవరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందని నాని స్పష్టం చేశారు. రైతులకు వెన్నంటి నడుస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement