ఇంకా విడుదల కాని అత్తారింటికి దారేది సినిమా పైరసీ సీడీలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు.
జగన్నాధపురం(తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్లైన్: ఇంకా విడుదల కాని అత్తారింటికి దారేది సినిమా పైరసీ సీడీలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇవి.. జగన్నాథపురంలో మణిశివకేశవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో గ్రామ కూడలిలో మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన గవిర్ని రాజు అక్కడికి వచ్చి అత్తారింటికి దారేది సినిమా సీడీ కృష్ణచౌదరి వద్ద ఉందని చెప్పాడు. దీంతో పైరసీ గుట్టు రట్టు చేయాలని తలచిన మణిశివకేశవ్ తనకు ఓ సీడీ కావాలని కృష్ణ చౌదరిని కోరడంతో అతను ఇచ్చాడు. దీంతో మణికేశవ్ పవన్కళ్యాణ్ అభిమానులకు ఫోన్చేయగా అక్కడకు వచ్చిన వారు ఓ సీడీ, మెమరీ కార్డు దొరికాయని రూరల్ పోలీసులకు అప్పగించారు. పవన్కళ్యాణ్ అభిమానులు కృష్ణ చౌదరి ఇంటికెళ్లారు.
అక్కడున్న కొందరు మహిళలు ఇక్కడ నుంచి వెళ్లకపోతే అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని మణిశివకేశవ్ తెలిపాడు. ఈ మేరకు అతను ఇన్చార్జి ఎస్సై ఎస్సీహెచ్ కొండలరావుకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయంలో పైరసీ చేసిన వారితో పోలీసులు కుమ్మక్కవతున్నారంటూ పవన్కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. కేసునమోదు చేయాలని, దోషులను వెంటనే శిక్షించాలంటే నినాదాలు చేశారు. పుల్లా అన్నవరం, ర్యాలీ నాగు, గట్టు గోపీకృష్ణ, మాకా దుర్గబాబు, గని, శ్రీరంగం అంజిబాబు, మట్టా రాంబాబు, బొడ్డు భాస్కర్ ఆందోళనకు నాయకత్వం వహించారు.
దాడి చేశారంటూ మహిళ ఫిర్యాదు
తనపై దాడిచేసి గాయపరిచారంటూ జగన్నాథపురానికి చెందిన పరిమి రామలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పైరసీ సీడీలు చేస్తున్నారంటూ తమ గ్రామానికి చెందిన కొందరు పవన్కల్యాణ్ అభిమానులు పారిచెర్ల కృష్ణచౌదరి ఇంటిలోకి వెళుతుంటే అడ్డుకున్నందుకు తనపై దాడిచేసి గాయపరిచారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్చార్జి ఎస్సై కేసు నమోదు చేశారు.