
రఘువీరాకు అభినందనలు: పవన్ కళ్యాణ్
ప్రత్యేకహోదా కోసం పోరాడే ప్రతి రాజకీయ పార్టీకి తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పోరాడే ప్రతి రాజకీయ పార్టీకి తన మద్దతు ఉంటుందని సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరులో ప్రత్యేకహోదా భరోసా సభ ఏర్పాటు చేసిన ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి అభినందనలు తెలిపారు. సమయాభావం వల్ల భరోసా సభలో పాల్గొనలేకపోతున్నానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీని సాధించుకునేందుకు అన్ని పార్టీలు ఓకే వేదికపైకి రావాలని ఆయన ఆకాంక్షించారు. భరోసా సభ లక్ష్యం నెరవేరాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విటర్ పేజీలో ఆదివారం పోస్ట్ పెట్టారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న భరోసా సభకు రావాలని పవన్ను రఘువీరారెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం జరగనున్న భరోసా సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, జనతాదళ్(యూ) మాజీ అధ్యక్షుడు శరత్యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, కార్యదర్శి రాజా తదితరులు హాజరుకానున్నారు.