జిల్లాలో పంచాయతీ కార్యదర్శి రాతపరీక్ష ఆదివారం చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శి రాతపరీక్ష ఆదివారం చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 57,721మంది అభ్యర్థులకుగాను ఉదయం పేపర్-1 పరీక్షకు 39,668 మంది, మధ్యాహ్నం పేపర్ 2కు 39,571 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 68.56 శాతం అభ్యర్థుల హాజరుఉన్నట్లు కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు.
కేంద్రాల వద్ద హడావుడి
రాతపరీక్ష సందర్భంగా అన్ని కేంద్రాల వద ్ద అభ్యర్థులు, వారి సంబంధీకుల హడావుడి కనిపించింది. గృహిణులు పరీక్ష రాయడానికివెళ్లగా.. వారి భర్తలు పిల్లలతో కేంద్రం బయట నిరీక్షించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడిపింది. అభ్యర్థులతో జిల్లా కేంద్రం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ వీర్రహ్మయ్య పర్యవేక్షణలో జిల్లా కోఆర్డినేట్ అధికారి సత్యవతి, డీపీవో కుమారస్వామిలు, జిల్లా అధికారులు పరీక్షాకేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
హాల్టికెట్లో ఒక చోట.. పరీక్షా కేంద్రం మరో చోట
అధికారుల అనాలోచిత నిర్ణయంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఈ గందరగోళం నెలకొంది. వావిలాలపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అభ్యర్థుల హాల్టికెట్లలో పొందుపరిచారు. ఆదివారం ఉదయం పరీక్ష సమయానికి వెళ్లే సరికి పరీక్ష ఇక్కడ కాదు.. ఆదర్శనగర్లోని ఎస్ఆర్ బాలుర జూనియర్కళాశాల అంటూ కళాశాల సిబ్బంది చెప్పారు. దీంతో అభ్యర్థులు హడావుడిగా ఆదర్శనగర్కు పరుగులు పెట్టారు. కాస్త ఆలస్యంగా వ చ్చిన అభ్యర్థులు, రెండు కేంద్రాలు తిరగడంతో మరింత ఆలస్యం జరిగింది. దీంతో పరీక్షా కేంద్రంలోనికి పోలీసులు అనుమతించలేదు. తమకు కేంద్రం తప్పుగా ఇచ్చారని, ఎందుకు అనుమతించరంటూ అభ్యర్థులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సూపరింటెండెంట్ వచ్చి అభ్యర్థులను అనుమతించారు. చివరినిమిషంలో పరీక్షా కేంద్రం మారిందని తెలియడంతో చాలా ఒత్తిడికి గురయ్యామని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.