సమైక్య ఉద్యమం ఆరంభమై 39 రోజులు దాటింది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
సాక్షి, గుంటూరు: సమైక్య ఉద్యమం ఆరంభమై 39 రోజులు దాటింది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు అందలేదు. మరో వైపు ఉద్యమంలో పాల్గొంటున్న వ్యాపారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇక్కడ జీతాలకన్నా జీవితాలే ముఖ్యమని ఉద్యోగులు, వ్యాపారం కంటే సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా వ్యాపారులు ఉద్యమబాటలో ముందుకు కదులుతున్నారు. నష్టపోయినా కష్టం లేదని రాష్ట్ర పరిరక్షణే ధ్యేయమని వ్యాపారులు చెబుతున్నారు.
జిల్లా అంతటా సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కారణంగా రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోవడంతో గ్రామాల నుంచి నిత్యం పట్టణాలకు వెళ్లే జనం లేకుండా పోయారు. దీనికితోడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సమ్మె కారణంగా మూతపడటంతో పట్టణాలకు వెళ్లే ఉద్యోగులు తక్కువయ్యారు. ఈ కారణాల వల్ల గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల వంటి పట్టణాల్లో వివిధ రకాల వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. గుంటూరులోని వాసవీ హోల్సేల్ వస్త్ర దుకాణాల సముదాయానికి నిత్యం వచ్చే కొనుగోలుదారులు బాగా తగ్గారు.
ఇదే విధంగా రెడీమేడ్ వస్త్రాలు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారాలు కూడా జనం లేక మందగించాయి. వివిధ రకాల పండ్ల దిగుమతికి కేంద్రమైన గుంటూరు, తెనాలి పట్టణాల్లో బేరాలు బాగా సన్న గిల్లాయి. అరటి, చక్కెరకేళి, బత్తాయి పండ్ల వ్యాపారానికి నిలయమైన పొన్నూరులోనూ కొనుగోళ్లు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి పండ్లను హోల్సేల్గా కొనుగోలు చేసే వారు తగ్గారు.
తగ్గిన చవితి కొనుగోళ్లు..
వినాయక చవితికి వారం రోజుల ముందు నుంచే గుంటూరులో రెడీమేడ్ వస్త్ర వ్యాపారాలు ఊపందుకునేవి. అయితే ఈ ఏడాది మాత్రం వీటి అమ్మకాలు బాగా తగ్గాయి. వస్త్ర వ్యాపారానికి పేరున్న బ్రాడీపేట, నాజ్సెంటర్, పాత బస్టాండ్ , కొత్తపేట సెంటర్లలో శనివారం కొనుగోలుదారులు బాగా తక్కువగా కనిపించారు. ఇక గుంటూరు, నర్సరావుపేట, తెనాలి వంటి ప్రధాన పట్టణాల్లోని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యాపారం, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ జనాలు లేక వ్యాపారాలు మందగించాయి. ఆర్టీసీ బస్సులు లేక రోజూ పట్టణాలకు వచ్చే గ్రామీణ జనం రాకపోవడమే కారణమని నిర్వాహకులు చెపుతున్నారు.
సినిమాహాళ్లలోనూ ప్రేక్షకుల సంఖ్య పలచగా ఉంటోంది. గుంటూరు నగరంలోని కొన్ని థియేటర్లలో మార్నింగ్షో, రెండో ఆటలకు పట్టుమని పదిమంది కూడా ఉండటం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేనప్పుడు అర్ధరాత్రి వరకూ బస్సులు తిరిగే అవకాశం ఉండటంతో గ్రామీణ జనం సెకండ్షో చూసి మరీ వెళ్లేవారు. ఇపుడా పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు పట్నంబజార్, తెనాలి గాంధీచౌక్ సెంటర్, సత్తెన పల్లి గడియారం స్తంభం సెంటర్, చిలకలూరిపేట చినరథం సెంటర్లలోనూ వ్యాపారాలు బాగా పడిపోయాయి. నిత్యం వేలాది మంది కొనుగోలుదారులతో కళకళలాడే ఈ వ్యాపార కూడళ్లు జనం తక్కువై వెలవెలబోతున్నాయి.
పట్టణాల్లో ఏర్పాటు చేసుకున్న ఏసీ సెలూన్లు, బ్యూటీపార్లర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజూ సుమారు రూ. మూడు కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే బ్రాడీపేట ప్రాంతంలోనూ క్రయవిక్రయాలు బాగా తగ్గాయి. వ్యాపారాలు ఇలా వున్నా వ్యాపారస్తులు మాత్రం సమైక్య ఉద్యమం వైపే పయనిస్తున్నారు. సమైక్య రాష్ట్రమే ధ్యేయమంటున్నారు. నష్టపోయినా ఉద్యమంలో పాల్గొని సమైక్య రాష్ట్ర పరిరక్షణకు పాటుపడతామని తెగేసి చెబుతున్నారు.