
రాజ్యాధికారమే ధ్యేయం
గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత, శ్రీశయన కులాలకు చెందినవారందరూ విభేదాలు పక్కనపెట్టి రాజ్యాధికారం సాధించడమే
కోటగుమ్మం (రాజమండ్రి) :గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత, శ్రీశయన కులాలకు చెందినవారందరూ విభేదాలు పక్కనపెట్టి రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. ఇందుకోసం సంఖ్యాబలం పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు రాజమండ్రి జేకే గార్డెన్స్లో మంగళవారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అన్ని కులా లూ సంఘీభావంతో మెలగి రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నా రు. జిల్లాలో విస్తృతంగా పర్యటించి సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఫిబ్రవరి 15న గౌడ, శెట్టిబలిజ మహాసభ విజయవాడలో జరుగుతుందని, ఇందులో భాగంగా ఆ రోజు చలో విజయవాడ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గౌడ, శెట్టిబలిజ, అనుబంధ కులాలకు చెందిన సమస్యలను అధికార, ప్రతిపక్షాల దృష్టికి తీసుకువెళ్తామని నారాయణరావు చెప్పారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ, రాజ్యాధికారం ద్వారానే సంఘీయుల అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్ని శాసించే స్థాయికి గౌడ, శెట్టిబలిజ సంఘం ఎదిగిందని అన్నారు. ఈ సభతో గౌడ, శెట్టిబలిజ, శ్రీైశయన, యాత తదితర కులాలను చిన్నచూపు చూస్తున్న పార్టీలకు కనువిప్పు కలగాలని అన్నారు. ఇప్పటికే 14 శాతం సీట్లు పొందుతున్న సంఘీయులు మరో 19 శాతం సీట్లు సాధిస్తే అధికారం వస్తుందన్నారు. ఐక్యతతో రాజకీయంగా సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గౌడ, శెట్టిబలిజ కులాలవారు విద్యావంతులు కావాలని సూచించారు.
మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నా గౌడ, శెట్టిబలిజ సంఘీయులకు గుర్తింపు లేదని అన్నారు. రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించలేదన్నారు. విజయవాడలో జరిగే మహాసభ ద్వారా సత్తా చాటాలన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోటీ ఏర్పడిందని, శాసనసభలో, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఇందులో భాగంగా మద్యం షాపుల్లో కొన్నిటిని గౌడ, శెట్టిబలిజలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బుడ్డిగ శ్రీను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు సన్మానం
ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన 411 మంది ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక విప్, ఒక ఎంపీ, 11 ఎంపీపీలు, తొమ్మిదిమంది జెడ్పీటీసీ సభ్యులు, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ఎనిమిదిమంది కార్పొరేటర్లు, జిల్లాలోని 36 మంది కౌన్సిలర్లు, 175 మంది ఎంపీటీసీ సభ్యులు, 157 మంది సర్పంచ్లు, ఐదుగురు బ్యాంక్ డైరక్టర్లకు ఈ అభినందన మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ పాలిక శ్రీను, మార్గాని చంటిబాబు, కుడుపూడి సత్తిబాబు, కడియాల వీరభద్రరావు, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.