శభాష్‌ కొండమ్మ.. 

Officials Congratulate Anganwadi Worker In Prakasam District - Sakshi

అంగన్‌వాడీ కార్యకర్తకు అధికారుల అభినందనలు  

సాక్షి, కనిగిరి :  తెల్లవారుజామున గర్భిణికి నొప్పులు రావడంతో దివ్యాంగురాలైన అంగన్‌వాడీ కార్యకర్త ఆమెను తన ట్రై సైకిల్‌ స్కూటీపై ఎక్కించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చిన ఘటన కనిగిరి మండలం నడింపల్లిలో ఆదివారం జరిగింది. నడింపల్లిలో గర్భిణి అయిన బి.ఏసమ్మకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త అయిన కొండమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె 108 వాహనానికి కాల్‌ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న రెండు 108 వాహనాల్లో ఒక వాహనం టైరు పంక్చరై ఉండగా, మరొక వాహనంలో ఒక గర్భిణిని తీసుకుని ఒంగోలు తరలిస్తున్నారని, రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. చదవండి: సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని.. 

లాక్‌డౌన్‌ కావడంతో ఇతర వాహనాలు కూడా అందుబాటులో లేవు. ఈక్రమంలో ఏసమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో దివ్యాంగురాలైన అంగన్‌వాడీ కార్యకర్త తన ట్రై సైకిల్‌ స్కూటీపై ఆమెను ఎక్కించుకుని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు లోపల బిడ్డ పరిస్థితి బాగా లేదని ఒంగోలు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. ఏసమ్మకు సాధారణ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సీడీపీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త చేసిన కృషిని, సేవను గుర్తించిన ఐసీడీఎస్‌ అధికారులు, గ్రామస్తులు అభినందించారు.
చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top