రేపటి నుంచి నో పెట్రోల్..!
హెల్మెట్ లేకుంటే బంకులోకి అనుమతించరు
సీట్ బెల్ట్ పెట్టుకోని డ్రైవర్లను కూడా..
ప్రమాదాల నివారణకు సీఎం చంద్రబాబు కఠిన నిర్ణయాలు
ఏపీ వ్యాప్తంగా గురువారం నుంచి అమలులోకి..
అమరావతి : హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్ బెల్టులు పెట్టుకోని డ్రైవర్లకు ఇధనాన్ని సరఫరా చేయరాదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు.
గురువారం ఉదయం నుంచే ఈ నిబంధన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి భద్రతపై బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ మేరకు తీసుకున్న కఠిన నిర్ణయాలను సీఎంవో మీడియాకు వెల్లడించింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యాంశాలివి..
⇒ హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఏపీలో ఇక తప్పనిసరి
⇒ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు
⇒ రహదారి భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల
⇒ రవాణా వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు ‘ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసే మనుషులున్నారు జాగ్రత్త’ అని బయలుదేరే సమయలో చెప్పాలి.
⇒ పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలి.
⇒రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుర్తించిన బ్లాక్ జోన్స్లో అసలు ఇబ్బంది ఏమిటో సత్వరమే గుర్తించి సరిచేయాలి. దీనిపై జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని సీఎం ఆదేశం
⇒ ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలి.
⇒ హదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
⇒నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు
ఎక్కువ శాతం ప్రమాదాలు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయి, అలాంటి చోట తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలి.
⇒ పట్టణ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలని సూచన.
⇒ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన శిక్షలు తప్పవు.
⇒ అన్ని స్కూల్ బస్సులకు, ఇతర పాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి
⇒ రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశంపై పరిశీలన
⇒ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు వంటి అవసరమైన సమాచారం లభించేలా ఒక ప్రత్యెక యాప్ తయారు చేయాలని సీఎం సూచన
⇒ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పోలిస్, రవాణ శాఖలు సంయుక్తంగా పని చేయడం వల్లే ఇది సాద్యమైందని కితాబు.
⇒ ప్రమాదాల్లో వెన్నుముక దెబ్బతిని శాశ్వత వైకల్యం పొందిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలన
⇒ రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వంటి వాహనాలన్నీ జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు.