మావోలపై... డేగకన్ను! | Naxals vs Police,High alert in Agencies | Sakshi
Sakshi News home page

మావోలపై... డేగకన్ను!

Nov 16 2013 4:50 AM | Updated on Aug 21 2018 5:44 PM

దండకారణ్యంలో అలజడి మొదలయింది. మరో 15 రోజులలో మావోయిస్టుల ప్రతిఘటన మాసాలు ప్రారంభం కానుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దండకారణ్యంలో అలజడి మొదలయింది. మరో 15 రోజులలో మావోయిస్టుల ప్రతిఘటన మాసాలు ప్రారంభం కానుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రతిఘటనను ఛేదించడానికి ముందస్తు వ్యూహంతో అడవిలోకి వెళుతున్నారు.   డిసెంబర్ నెల నుంచి మేవరకు దండకారణ్యంలో నిరంతర కూంబింగ్ నిర్వహణకు ప్రత్యేకంగా అదనపు బలగాలను జిల్లాకు రప్పిస్తున్నారు. మరోవైపు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్ర పోలీసుబలగాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్ర బలగాలు అప్రమత్తయమయ్యాయి.
 
 దండకారణ్యం అటవీప్రాంతం కేంద్రంగా మావోలు మూడురాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు.  భద్రాచలం డివిజన్ కేంద్రంగా జిల్లాలో మావోయిస్టులు తరచూ తమ ప్రాబల్యం చాటుతున్నారు. ముఖ్యంగా ప్రతిఘటన మాసాల్లో దాడులకు పథకరచన చేస్తుంటారు. అసలే చలికాలం కావటంతో దండకారణ్యం అంతా దట్టమైన పొగమంచుతో నిండి ఉంటుంది. ఈ సమయంలో పోలీసుల కూంబింగ్‌కు కొంత విఘాతం కలుగుతుంది. దీనిని అదనుగా భావించే మావోలు ఈసమయంలో దాడులు చేయటం,  ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం నుంచి రాష్ట్రంలోని అటవీప్రాంతానికి చేరుకొని కార్యకలాపాలు సాగించడం చేస్తుంటారు.   గతంలో కూంబింగ్ నిర్వహించే పోలీసులపై మావోలు ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఈ అనుభవాల దృష్ట్యా ఇప్పుడు పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
  భద్రాచలం డివిజన్ కేంద్రంగా విస్తరించి ఉన్న దండకారణ్యం.. జిల్లాలో 240 కిలోమీటర్ల పరిధి మేరకు ఉంది. సరిహద్దులోని ఒడిశా రాష్ట్రంలో మరో 30 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం 270 కిలోమీటర్లు మావోయిస్టు జోన్‌గా గుర్తించి ఈప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుంటారు. నార్త్ తెలంగాణ జోన్‌కు చెందిన 80 మంది మావోయిస్టులు  దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 30 మంది జిల్లాకు చెందిన మావోయిస్టులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రతిఘటన మాసాలు మొదలుకానున్న క్రమంలో రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతోపాటు దాడులను తిప్పి కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గడిచిన పదే ళ్లలో ప్రధాన ఎన్‌కౌంటర్లు ఇదే సమయంలో జరిగాయి. వీటిలో 18 ఆయుధాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు మూడు ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారు.  ప్రధానంగా ఒకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోలు మృతిచెందారు. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరిగాయి. వీటిని లక్ష్యంగా చేసుకొని మావోలు పలు విధ్వంసాలకు పాల్పడారు. ఈనెల 18న రెండో విడత జరగనున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తికాగానే దండకారణ్యంను బేస్‌క్యాంప్‌గా చేసుకొని మావోలు రాష్ట్రంపై దృష్టిసారించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి.
 
 కూంబింగ్ కోసం....
 ఈపరిణామాల క్రమంలో జిల్లా పోలీసు యంత్రాగం కూంబింగ్‌పైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.  ప్రతిఘటన సమయంలో మావోలు సత్తాచాటుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్న బలగాలతో పాటు 50శాతం అదనపు బలగాలను దండకారణ్యంలోకి మరోవారంలో పంపనున్నారు. ఇప్పటికే భద్రాచలం డివిజన్ నుంచి కూంబింగ్ చేసుకుంటూ విజయవంతగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి వెళ్లగలిగామని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈక్రమంలో ప్రతిఘటన మాసాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement