‘తెలంగాణ కోసం ఎక్కువ కొట్లాడుతున్నడనే నా కొడుకుపై లగడపాటి స్ప్రే చల్లిండు. నా కొడుకు కళ్లుపోతే ఎవరు బాధ్యులు?’ అంటూ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తల్లి పొన్నం మల్లమ్మ ఆవేదనతో ప్రశ్నించారు.
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : ‘తెలంగాణ కోసం ఎక్కువ కొట్లాడుతున్నడనే నా కొడుకుపై లగడపాటి స్ప్రే చల్లిండు. నా కొడుకు కళ్లుపోతే ఎవరు బాధ్యులు?’ అంటూ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తల్లి పొన్నం మల్లమ్మ ఆవేదనతో ప్రశ్నించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్సభలో పొన్నంపై స్ప్రే చల్లడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మల్లమ్మ స్వయంగా పాల్గొని తన నిరసన తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్నాడనే ఉద్దేశంతోనే లగడపాటి తన కుమారుడి కళ్లలో స్ప్రే చల్లాడని అన్నారు.
తన కొడుకుపై జరిగిన ఈ దాడితో ఒక తల్లిగా తానెంత తల్లడిల్లుతున్నానో, లగడపాటి కుటుంబానికి కూడా అనుభవంలోకి రావాలన్నారు. తన కొడుకును తెలంగాణ కోసం పోరాడమని తాము ప్రోత్సహించామని తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుం దని, ఆమె బాటలోనే తన కుమారుడు పయనిస్తున్నాడని పేర్కొన్నారు.