అకాల వర్షాలు కురుస్తుండడంతో అనుకోని రీతిలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి
జలాశయాలలోకి భారీ వరద
పొంగి పొర్లుతున్న నల్లవాగు
నిండిన కళ్యాణి ప్రాజెక్టు
పంటలకు మాత్రం తీరని నష్టం
నిజాంసాగర్, న్యూస్లైన్ :
అకాల వర్షాలు కురుస్తుండడంతో అనుకోని రీతిలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి. వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాలలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. అయి తే వర్షాల కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పండిస్తున్న పంటలు నాశనమవుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్లో
జిల్లాలో సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిజాం సాగర్ ప్రాజెక్టునుంచి సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాలనుంచి 811 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,398.92 అడుగుల(10.228 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
చిన్న ప్రాజెక్టులు
మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో మండలంలోని నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని సింగితం రిజర్వాయర్లోకి ప్రస్తుతం 150 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టులోకీ వరదనీరు వచ్చి చేరుతోంది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 408.800 మీటర్ల నీరుంది.
రైతన్నపై తీవ్ర ప్రభావం
అకాల వర్షాలు రబీ పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. వ్యవసాయ బోరుబావులు, చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాల కింద సాగవుతున్న పంటలకు అపార నష్టం కలిగించాయి. జిల్లాలో పొద్దుతిరుగుడు, మొక్క జొన్న, జొన్న పంటలకు పూర్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వరి ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయి.
117 మిల్లీమీటర్లు
జిల్లాలో పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈనెలలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో సైతం వారం వ్యవధిలో ఇంతగా వర్షపాతం నమోదు కాదని రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల ఒకటిన 12 మిల్లిమీటర్లు, 4న 35 మి.మి., 5 న 16 మి.మి., 6న 34 మి.మి., 8న 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.