వైద్య విద్య బలోపేతానికి కృషి | medical education strengthen Efforts to | Sakshi
Sakshi News home page

వైద్య విద్య బలోపేతానికి కృషి

Feb 22 2016 1:51 AM | Updated on Sep 3 2017 6:07 PM

రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్

గుంటూరు మెడికల్ :  రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం..గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా రూ.7 కోట్లతో నిర్మించిన హౌస్‌సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థుల మహిళా వసతి గృహాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జీజీహెచ్‌కు మంచి పేరు ఉందని, ప్రైవేటు ఆస్పత్రులు పెరగడం వల్ల కొంత ఆదరణ తగ్గిందని తెలిపారు.

ఆస్పత్రికి పూర్వ వైభవ తెస్తామన్నారు. జీజీహెచ్‌లో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు, రూ. 10 కోట్లతో సర్వీస్ బ్లాక్, రూ. 7.6 కోట్లతో సీనియర్ రెసిడెంట్ల క్వార్టర్, రూ. 20 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ. 20 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో రూ.30 కోట్లతో వీడియో క్లాస్‌రూమ్‌లు, స్కీల్ ల్యాబ్ స్టిమ్యూలేషన్ సెంటర్ నిర్మాణాలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు పరం చేయడం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రసంగించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  గుంటుపల్లి సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, డీఎంవోహెచ్‌వో పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement