నేడు మావోల బంద్‌

Maoists Bandh In Srikakulam AOB - Sakshi

ముందస్తు చర్యల్లో పోలీసులు  

శ్రీకాకుళం,భామిని: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో జరిగి న ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ, ఆ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సుశీల, సన్నాయి, మీనా తదితరులకు నివాళులు అర్పిస్తూ ఏఓబీ మావోయిస్టులు మంగళవారం మన్యం బంద్‌నకు పిలుపునిచ్చారు. దీనిపై స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యం బంద్‌కు ఏఓబీ కార్యదర్శి జగబంద్‌ పిలుపు మేరకు పోలీసులు ముందస్తు చర్యల్లోతలమునకలయ్యారు. సోమవారం సరిహద్దులో ము మ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. మంగళవారం జరగనున్న ఏజెన్సీ బంద్‌ నేపథ్యంలో ముందస్తుగా సోమవారం రాత్రి ఏజెన్సీ వైపు వచ్చే ఆర్టీసీలు నిలిపివేశారు. ప్రధానంగా కొత్తూరు నుంచి భామిని, బత్తిలి వైపు వచ్చే బస్సులను కొత్తూరులోనే ఆపివేశారు. మంగళవారం కూడా రాత్రి పూట బస్సులు నిలిపివేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

తివ్వాకొండలపై నిఘా..
ఏఓబీలో కీలకమైన తివ్వాకొండలపై పోలీస్‌ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మావోల బంద్‌ నేపథ్యంలో గత వారం రోజులుగా తివ్వాకొండల్లోని గిరిజన గూడలను సాయుధ పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి గిరిజన గ్రామాన్ని సందర్శించి ఆది వాసీలతో స్నేహ సంబంధాలు పెంచుకొంటూ కొత్త వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక సాయుధ దళాలు కూడా సరిహద్దులో ముమ్మర కూంబింగ్‌లు చేపట్టాయి. బంద్‌ నే పథ్యంలో అధికార పార్టీ నాయకులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో పర్యటనలు చేస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులను స్టేషన్‌కు రప్పించి వాకబు చేస్తున్నారు. 

‘ఇల్లు దాటి వెళ్లకండి’
కొత్తూరు: మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు ఏజెన్సీ పోలీస్‌ స్టేషన్లయిన సీతంపేట, దోనుబాయి, బత్తిలి, కొత్తూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. నాలుగు స్పెషల్‌ పార్టీ(ఎస్‌టీఎఫ్‌) దళాలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. సీతంపేట నుంచి కొత్తూరు, బత్తిలి నుంచి కొత్తూరు, దోనుబాయి నుంచి సీతంపేటతో పాటు పలు గిరిజన రహదార్లలో సోమవారం స్పెషల్‌ పార్టీలు ఆర్‌ఓపీ నిర్వహించారు.

ప్రతి కల్వర్టు వద్దా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా సీఐ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు గుర్తించిన ప్రజాప్రతినిధులకు ముం దుగానే హెచ్చరికలు పంపించారు. సమాచారం ఇవ్వకుండా ఇల్లు దాటి బయటకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి సోమవారం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top