‘తూర్పు’ ఏజెన్సీ ప్రాంతంలో 34 మంది మావోయిస్టు సానుభూతిపరులు బుధవారం రాజవొమ్మంగిలో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఎదుట లొంగిపోయారు.
కాకినాడ క్రైం : ‘తూర్పు’ ఏజెన్సీ ప్రాంతంలో 34 మంది మావోయిస్టు సానుభూతిపరులు బుధవారం రాజవొమ్మంగిలో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన 13 మంది, రాజవొమ్మంగి స్టేషన్ పరిధికి చెందిన 21 మంది దశాబ్దం నుంచి మావోయిస్టు సానుభూతిపరులుగా ఉంటూ వారికి భోజనాల ఏర్పాటు, సమాచార సేకరణ, మందులు, సరుకులు సమకూర్చడం, సమావేశాలకు జన సమీకరణ, బంద్కు పిలుపునిచ్చిన సందర్భాల్లో బ్యానర్లు కట్టడం, కరపత్రాల పంపిణీ వంటివి చేస్తున్నారు. కాగా లొంగిపోయిన ఆ 34 మందికీ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. వారి పిల్లల చదువులు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా శిక్షణ కూడా ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభావితమై లొంగిపోతున్నట్లు తెలిపారన్నారు. ఓఎస్డీ వై.రవిశంకర్రెడి, సీఐ కేఎన్ మోహన్రెడ్డి, రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్సై పాల్గొన్నారు.