పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

Man Died In Road Accidents In East Godavari  - Sakshi

సాక్షి, రాజానగరం(తూర్పు గోదావరి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి పై లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దివాన్‌చెరువుకు చెందిన బలభద్ర వీరభద్రరావు అనే చిన్నబ్బు (55) అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఇయ్యపురాలిని పరామర్శించేందుకు భార్య, మనుమడితో కలసి బైకు పై వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ అధిగమించే ప్రయత్నంలో రహదారి పక్క నుంచి వెళుతున్న చిన్నబ్బు బైకును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడి భార్య, మనుమడు రహదారికి ఎడమ వైపు పడిపోగా, చిన్నబ్బు కుడివైపునకు పడటంతో లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో చిన్నబ్బు భార్య సూర్యలక్ష్మి సొమ్మసిల్లి పోయారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరభద్రరావు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top