నేటి నుంచి లారీల బంద్‌ | Lorry Strike in Nationwide From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లారీల బంద్‌

Jul 20 2018 8:18 AM | Updated on Jul 20 2018 8:18 AM

Lorry Strike in Nationwide From Today - Sakshi

చిత్తూరులో ఆగిన లారీలు

చిత్తూరు అర్బన్‌: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి లారీల సమ్మెకు పిలుపునిచ్చారు. జిల్లాలోని లారీ యజమానులు ఈ సమ్మెకు మద్దతు పలికి బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు జిల్లా సరిహద్దు కావడంతో గురువారం సాయంత్రం నుంచే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు జిల్లాలో ఆగిపోయాయి.

డిమాండ్లు ఇవీ..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా నష్టపోతున్నది తెలుగు రాష్ట్రాల్లోని లారీ యజమానులేనని యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి రావడం, సరుకుల రవాణకు ఇ–వే బిల్లు తప్పనిసరి చేయడం రవాణా రంగాన్ని కుదిపేసింది. ఫలితంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వం సానుభూతి చూపకపోగా సమస్యను మరిం త జఠిలం చేస్తోందని లారీ యజమానుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ లారీ యజమానికి రెండో లారీ ఉంటే ఆదాయ పన్ను చట్టం 44వ సెక్షన్‌ కింద వసూ లు చేస్తున్న రూ.50 వేలను రద్దు చేయాలి.
ఇప్పటివరకు థర్డ్‌ పార్టీ కింద లారీలకు రూ.15 వేలు చెల్లిస్తున్న బీమాను ఒక్కసారిగా రూ.50 వేలకు పెంచేశారు. దీన్ని రూ.15 వేలకే పరిమితం చేయాలి.
కాలం చెల్లిన టోల్‌గేట్‌ ప్లాజాల దోపిడీని వెంటనే నిలిపేయాలి. రాజకీయ అండదండలతో జరుగుతున్న అనధికార దోపిడీని అడ్డుకోవాలి.
ఇష్టానుసారం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించడానికి వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.
జాతీయ పర్మిట్‌ ఉన్న సరుకుల రవాణా వాహనానికి ఇద్దరు డ్రైవర్లు పెట్టుకోవాలనే నిబంధనను రద్దు చేయాలి.
రవాణా శాఖ, పోలీసులు, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు లంచాల కోసం చేస్తున్న దోపిడీని నిరోధించాలి.

ప్రభావం ఇలా..
బంద్‌కు జిల్లాలోని మినీ లారీలు, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఉన్నఫళంగా కూరగాయల ధరలు పెరిగిపోనున్నాయి. పెట్రోలు, డీజిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడనుంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న మామిడి రైతులు లారీల సమ్మెతో పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎదురై ధరలు మరింత పత నం కానున్నాయి. బెల్లం, గ్రానైట్, సిమెంటు, గ్యాస్, లాజిస్టిక్‌ సర్వీసులు (పార్శిల్‌) స్తంభించనున్నాయి. బంద్‌లో పాలు, నీళ్లు, నిత్యావసర వస్తువులకు మినహాయింపు ఇస్తున్నట్లు యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. ఇక ఒక్కో లారీపై ప్ర త్యక్షంగా యజమాని, డ్రైవర్, క్లీనర్‌ కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. పరోక్షంగా హమాలీలు, వ్యాపారులు, తోపుడు బళ్ల వాళ్లు.. ఇలా వేలాది మంది ఉపాధి దెబ్బతినే అవకాశముంది.

రోజుకు రూ.2 కోట్ల నష్టం..
జిల్లాలో లారీల బంద్‌ వల్ల రోజుకు రూ.2 కోట్ల నష్టం వస్తుంది. చాలామంది బతుకులు జరగవు. కానీ తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మాతో పాటు డ్రైవర్, క్లీనర్‌ కుటుం బాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మేము అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయమైనవని గుర్తించండి. ఒక్కసారి బంద్‌లోకి దిగాక దాని తర్వాత ఎదురయ్యే పరి ణామాలకు మేము బాధ్యులుకామని ప్రభుత్వాలు గుర్తించుకోవాలి.         – టి.చెంగల్రాయనాయుడు, జిల్లాఉపాధ్యక్షులు, లారీ యజమానుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement