నాయకుడే హంతకుడైతే.. | leader became as killer | Sakshi
Sakshi News home page

నాయకుడే హంతకుడైతే..

Aug 27 2013 5:28 AM | Updated on Aug 21 2018 5:44 PM

నాయకుడే హంతకుడైతే ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిందెవరు? తనసొంత నియోజకవర్గ ప్రజ లకు అండగా ఉంటూ న్యాయ అన్యాయాలపై అధికారులను ప్రశ్నించాల్సింది పోయి తానుచేసిన పొరపాటుకు టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ ఓ ప్రజాప్రతినిధిగా పోలీ సుల ఎదుట ఇలా నిందితుడిగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

 మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: నాయకుడే హంతకుడైతే ఇక ప్రజలకు రక్షణ క ల్పించాల్సిందెవరు? తనసొంత నియోజకవర్గ ప్రజ లకు అండగా ఉంటూ న్యాయ అన్యాయాలపై అధికారులను ప్రశ్నించాల్సింది పోయి తానుచేసిన పొరపాటుకు టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ ఓ ప్రజాప్రతినిధిగా పోలీ సుల ఎదుట ఇలా నిందితుడిగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. సరిగ్గా 42 రోజుల క్రితం దేవరకద్ర మండలకేంద్రంలో జరిగిన జగన్‌మోహన్ హత్యకేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధన్వాడ మండలం పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ సీటుపై తన భార్య భవానీని ఏదో ఒక విధంగా కూర్చోబెట్టాల నే అత్యాశే అతని కొంపముంచింది. భవానీకి పోటీగా సొంత సోదరుడు జగన్‌మోహన్ భార్య అశ్రీతను రం గంలో ఉండటాన్ని ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జీర్ణించుకోలేకపోయాడు.
 
 పోటీనుంచి తప్పుకుంటే రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం ఇస్తానని సర్పంచ్ పదవి కోసం పోటీకి రావద్దని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పలుమార్లు వేడుకున్నా జగన్‌మోహన్ ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఎమ్మెల్యేకు చెందిన లైసైన్స్‌డ్ పిస్తోల్‌తో మూడురౌండ్ల కాల్పులు జరపడం వల్లే జగన్‌మోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడి ంచారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
 
 ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన టి.తిమ్మన్న, ఎమ్మెల్యే సోదరుడు జగన్‌మోహన్‌కు కూడా సన్నిహితంగా కూడా ఉండేవాడని, అందులో భాగంగానే అన్నదమ్ముల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను రాజీకుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోవడంతో హత్యచేశారని ఎస్పీ వివరించారు. హత్యానంతరం ఎమ్మెల్యే బెంగళూరు, మైసూర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు తెలిపారు. కేసులో తొమ్మిది మంది నిందితులు ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు తుమ్మల తిమ్మన్న, తుమ్మల రాములు, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డ్రైవర్ బి.రమేష్ బాబు లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు. జూలై 17న హత్య జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరించారు. ఇలా తప్పని పరిస్థితుల్లో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement