వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్‌గా వినాయకరెడ్డి | kommula vinayaka reddy is appointed convenor of the YSRCP party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్‌గా వినాయకరెడ్డి

Dec 1 2013 4:28 AM | Updated on Aug 17 2018 2:53 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా కొమ్ముల వినాయకరెడ్డి నియమితులయ్యారు. పార్టీ యు వజన విభాగం జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయనను జి ల్లా కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా కొమ్ముల వినాయకరెడ్డి నియమితులయ్యారు. పార్టీ యు వజన విభాగం జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయనను జి ల్లా కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీ యువజన విభాగం కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించిన వినాయకరెడ్డిని జిల్లా కన్వీనర్‌గా నియమించారు.
నిర్మల్ నియోజకవర్గానికి చెందిన వినాయకరెడ్డి న్వాయవాదిగా కూడా ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు మొదటిసారి జిల్లాలో యువజన సదస్సును ఆయన విజయవంతంగా  నిర్వహించారు. బడుగు, బలహీన, గిరిజన ప్రజల తరఫున పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరిట నిర్మల్‌లో పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. యువజన నేతగా పార్టీ కోసం పనిచేసిన వినాయకరెడ్డిని పార్టీ జిల్లా కన్వీనర్‌గా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
 వినాయకరెడ్డి బయోడేటా..
 కొమ్ముల వినాయక్‌రెడ్డి స్వగ్రామం దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి. ఈయన ఏడో తరగతి వరకు స్వగ్రామంలో, అనంతరం పదో తరగతి వరకు నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియెట్ ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రాం కళాశాలలో, హైదరాబాద్ పడాల రాంరెడ్డి లా కళాశాలలో లా చదివారు. డిగ్రీలో ఉన్న సమయంలో రెండు పర్యాయాలు ఏబీవీపీ కళాశాల అధ్యక్షుడిగా పనిచేశారు. లా చదివే సమయంలో ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పని చేశారు. అనంతరం నిర్మల్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

2001లో టీఆర్‌ఎస్‌లో చేరి 2004లో పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో సారంగాపూర్, దిలావర్‌పూర్ మండలాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన సంక్షేమ పథకాలు తిరిగి సాకారం కావాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అయితేనే సాధ్యమని నిర్మల్ నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పోస్టుకార్డులు రాయించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందే ఆయన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట ఉన్నారు.

పార్టీ ఆవిర్భావం అనంతరం జిల్లా అధికార ప్రతినిధిగా, స్టీరింగ్ కమిటీ మెంబర్‌గా, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో 2004లో హృదయరాజు ‘వైఎస్‌ఆర్’ పుస్తకాన్ని సైతం రచించారు.
 ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గ  సమన్వయకర్తగా రవిప్రసాద్
 కాగా, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్.రవిప్రసాద్ నియమితులయ్యారు. పశ్చిమ జిల్లా కో కన్వీనర్‌గా ఉన్న ఆయన ఇకనుంచి ముథోల్ నియోజకవర్గం సమన్వయకర్తగానూ వ్యవహరించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ అభిమానిగా ఉన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన కో-కన్వీనర్‌గా పశ్చిమ జిల్లా పరిధిలోని పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను నిర్వహించారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన రవిప్రసాద్‌ను వైఎస్సార్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి ఆయనకు కో-కన్వీనర్ బాధ్యతలు పార్టీ అధిష్టానం, తాజాగా ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement