‘బాబు యూటర్న్ తీసుకుని జగన్ బాటలోకి’
సాక్షి, విజయనగరం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని విజయవంతం చేసినవారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు జగన్ పాదయాత్ర భరోసాని, ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు భయపడి దిక్కులేని పరిస్థితిలో చంద్రబాబు ఫించన్లను పెంచారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాకముందే విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందనీ, చంద్రబాబు యూటర్న్ తీసుకుని జగన్ బాటలోకి వచ్చారని తెలిపారు.
బీజేపీ, టీడీపీలకు దోస్తీ చెడితే అది రాష్ట్రానికి ఆపాదించడం ఎంతవరకు సరిఅని ఆయన ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికీ, రాజకీయ అండకోసం చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. జగన్పై జరిగిన దాడి కేసును ఎన్ఐఏ నుంచి పక్కదారి పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఐఏ దర్యాప్తులో పూర్తి నిజనిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.