సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ధర్మవరం ఎమ్మెల్యే కే తిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం పట్టణంలోని పాండురంగ సర్కిల్లో 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
ధర్మవరం టౌన్/ అర్బన్, న్యూస్లైన్ : సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ధర్మవరం ఎమ్మెల్యే కే తిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం పట్టణంలోని పాండురంగ సర్కిల్లో 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీలోకి చేరి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ధర్మవరం పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆ పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ సాదరంగా ఆహ్వానించారు.
బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పోరాడుతోంది ఒక్క వైఎస్సార్సీపీనేనని స్పష్టం చేశారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడ్డారని కొనియాడారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. తమ పదవులను సైత ం త్యజించి ఆమరణ దీక్షలు చేపట్టారన్నారు. దీక్షలో ఎమ్మెల్యే కేతిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కంచం లీలావతి, మాజీ కౌన్సిలర్ రమాదేవి, నాయకులు శంకర్రెడ్డి, రేగాటిపల్లి సురేష్రెడ్డి, గొట్లూరు పోతిరెడ్డి, పరంధామరెడ్డి కూర్చొన్నారు. ఈ దీక్షకు పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, కదిరి నియోజకవర్గ నాయకుడు వజ్ర భాస్కరరెడ్డి, పెనుకొండ నియోజకవర్గ నాయకురాలు సానే ఉమారాణి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పగడాల మల్లికార్జున, ధర్మవరం జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, భాస్కరరెడ్డి, రామ్మోహన్నాయుడు, శెట్టిపి జయచంద్రారెడ్డి, ఉరుకుందప్ప, నాగార్జునరెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
విభజన పాపం చంద్రబాబుదే
రాష్ట్ర విభజన పాపం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిరవధిక దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరోమారు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రం విషయంలో మిగతా పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ మాత్రమే రాష్ట్ర పరిరక్షణకు పాటుపడుతోందన్నారు.
విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షలు చేపట్టారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఆయన చేపడుతున్న నిరవధిక దీక్ష మరింత మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇకనైనా పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులను త్యజించి... ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు.
దమ్మున్న నాయకుడు జగన్
సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య కొనియాడారు. కాంగ్రెస్, టీడీపీ నాయకుల మాదిరి ఓట్లు, సీట్ల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థరాజకీయాలను తిప్పికొడుతున్న దమ్మున్న వ్యక్తి జగన్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేపడతానంటుండడం సిగ్గు చేటన్నారు.
స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ధర్మవరం నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసిన ఘనత కేతిరెడ్డికే దక్కిందని కొనియాడారు. జగన్ దీక్షలకు మద్దతుగా కేతిరెడ్డి దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు.