బాబు టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారా.?

Karumuri Nageswara Rao Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: కర్నాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విక్టరీ సింబల్‌ కాకుండా హస్తం చూపించడంతో ఆయన నైజం బట్టబయలైందని వైఎస్పార్‌సీపీ కో ఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని బాబు కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఇదివరకూ ఎప్పుడూ రెండు వేళ్లు చూపించే బాబు సోనియా రాహుల్‌తో కలిసి హస్తం గుర్తు చూపిస్తూ చేయి ఊపుతున్నారంటే టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారా.? అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి కుట్ర చేసి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించిన విషయం స్పష్టమైందన్నారు. అదేవిధంగా బాబు రాష్ట్రాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. 

చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించడం హాస్యాస్పదమన్నారు. 1983లో పుట్టిన తెలుగుదేశం పార్టీ బ్రిటిష్ వారితో పోరాడిందని అనటం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. బాబు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి కారకుడయ్యారని గుర్తుచేశారు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు పేరుతో పథకాలు ఉంటాయని, ఎన్నికలు దగ్గర పడేసరికి ఎన్టీఆర్ పేరుతో పథకాలు చేపడతారని ఆరోపించారు. జూన్ 3, 4 తేదీల్లో తణుకు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్ పాదయాత్ర చేస్తారని తెలిపారు. యాత్ర జూన్‌ 3న అయితంపూడిలో ప్రవేశించి 4వ తేది రాత్రి పాలంగిలో  ముగుస్తుందన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top