ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయని జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయకుండా సమైక్య దీక్ష కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయకుండా సమైక్య దీక్ష కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయన అయిదు రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో దీక్ష విరమించాలని ఆయనను పరీక్షించిన ఉస్మానియా వైద్యులు కోరారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి నూట అయిదు గంటలు దాటిపోయింది.
జగన్ను మధ్యాహ్నం పరీక్షించిన వైద్యులు హార్ట్ బీటింగ్ 72గా ఉందని తెలిపారు. సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్ 4+ గా ఉన్నట్లు వివరించారు. శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు. అభిమానులు కూడా ఆయన చేత దీక్ష విరమింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ నేపధ్యంలో సతీమణి భారతి, మామ గంగిరెడ్డి వచ్చి జగన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి జాతీయ నాయకులు, పార్టీ నేతలు, బంధువులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించాలని కోరుతున్నారు. ఆయన మాత్రం ససేమీరా అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.


