
ఇది దగాకోరు ప్రభుత్వం
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో దళిత, గిరిజనుల సంక్షేమ కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను టీడీపీ ప్రభుత్వం దగాచేసిందని....
సమస్యలపై వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన రోడ్డు దిగ్బంధం, ధర్నాల కారణంగా గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు రెండు వైపులా బారులు తీరాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు.
అనంతపురం అర్బన్:
ఎన్నికల సమయంలో దళిత, గిరిజనుల సంక్షేమ కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను టీడీపీ ప్రభుత్వం దగాచేసిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీ కేశవరెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, ఏపీ గిరిజన, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజనుల సబ్ ప్లాన్ నిధులను జనాభా దామాషా ప్రకారం ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొనేరు రంగారావు భూ కమిటీని ప్రభుత్వం వెంటనే ఆమోదించి, సిఫారస్సులను పక్కగా అమలు చేయాలన్నారు. దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూమలకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి 200 రోజులు పని కల్పించి, రోజు వేతనం రూ. 300 చెల్లించాలన్నారు.
100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ డీఆర్ఓ చక్రపాణికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రఘవయ్య, ఏపీ గిరిజన సమాఖ్య సహాయ కార్యదర్శి ఎస్. నాగరాజు నాయక్, నాయకులు మల్లికార్జున, వెంకటేష్, తదితరలు పాల్గొన్నారు.