ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా | Intelligence on Redwood smugglers | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా

Jul 3 2014 12:46 AM | Updated on Oct 22 2018 1:59 PM

ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా ఉంచామని, ఇప్పటికే నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 35 మందిని గుర్తించినట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల డివిజన్ ఇన్‌చార్జ్ ఫారెస్టు అధికారి చంద్రశేఖర్ తెలిపారు.

 రుద్రవరం:  ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా ఉంచామని, ఇప్పటికే  నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 35 మందిని గుర్తించినట్లు  జిల్లా స్క్వాడ్, నంద్యాల డివిజన్ ఇన్‌చార్జ్ ఫారెస్టు అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గుర్తించిన వారిలో  10 మందిపై పీడీయాక్ట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు.

బుధవారం ఆయన అహోబిలం అటవీ సెక్షన్‌లోని బోరింగ్ రస్తా, ఊట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేష్ క్యాంపులతో పాటు అహోబిలం పారెస్టు కార్యాలయం, నర్సాపురం చెక్ పోస్టును తనిఖీచేశారు. తర్వాత రుద్రవరం అటవీ కార్యాలయం అవరణలోని నర్సరీని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల డి. వనిపెంట సెక్షన్‌లోని ముత్యాల పాడు గ్రామానికి చెందిన స్మగ్లర్ మస్తాన్ వలిని పీడీయాక్ట్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు.  జిల్లాలో పారెస్టుకు సంబంధించి 1500 కేసులు నమోదు కాగా వాటిలో ఎర్రచందనం కేసులు 500 ఉన్నాయన్నారు.

ఈ కేసుల్లో నిందితులైన 453 మందిని ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. అటవీ సంపదను కాపాడుకునేందుకు   నంద్యాల డివిజన్ పరిధిలోని బండిఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల, చెలిమ, రుద్రవరం ఫారెస్ట్ రేంజ్‌లలో  144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. నల్లమల అటవీలో 12 పులులను గుర్తించామని చెప్పారు. బేష్ క్యాంపుల్లో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించక పోతే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట రేంజ్ అధికారి రామ్‌సింగ్‌తో పాటు అటవీ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement