కొవ్వొత్తుల ప్రదర్శన | In kurnool performed candles rally | Sakshi
Sakshi News home page

కొవ్వొత్తుల ప్రదర్శన

Sep 23 2013 4:41 AM | Updated on Sep 1 2017 10:57 PM

కర్నూలులోని నంద్యాల రోడ్డులో ఆదివారం భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక కాలనీలు, అపార్టుమెంట్ల నివాసితులు స్వచ్ఛందంగా సమైక్య నినాదాన్ని హోరెత్తించారు.

 కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలులోని నంద్యాల రోడ్డులో ఆదివారం భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఒకటి కాదు  రెండు కాదు.. అనేక కాలనీలు, అపార్టుమెంట్ల నివాసితులు స్వచ్ఛందంగా  సమైక్య నినాదాన్ని హోరెత్తించారు.  
 
 నగరంలోని సాయివసంత నిలయం, విశ్వసాయి, శ్రీశైల నివాస్, కృష్ణకాంత్, జంపాల అపార్టుమెంట్‌లతోపాటు మాధవనగర్, డాక్టర్స్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, కిసాన్‌నగర్, టెలికాంనగర్, శ్రీనగర్‌కాలనీ, గఫూర్‌కాలనీ, కమలానగర్, చంద్రశేఖర్‌నగర్, జయరాంనగర్, రెవెన్యూకాలనీ, గణేశ్‌నగర్, సాయిబాబాకాలనీ, సోమిశెట్టినగర్, సిండికేట్‌బ్యాంక్ కాలనీల ప్రజలు, మాస్టర్‌మైండ్స్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజీల సిబ్బంది, విద్యార్థులు, గంగాభవానీ రజక సంఘం, ఐరన్ అండ్ స్టీల్ షాపుల యజమానులు ఒక చోటికి చేరి కొవ్వొతుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విభజనపై ప్రజలు తమ గళం వినిపించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పెరుగు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 5
 రాజీనామా చేయండి: ఎస్వీ పిలుపు
 కర్నూలు, న్యూస్‌లైన్: ‘‘విభజనపై వెనక్కి తగ్గేది లేదు. తెలంగాణ ఏర్పాటుపై నోట్ తయారవుతోంది. పదవులకు రాజీనామా చేసుకోండి’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అవమానకరంగా మాట్లాడుతున్నాడని.. వాటిని భరించే కంటే రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
 
 
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ పిలుపులో భాగంగా 24న చేపట్టనున్న బంద్ నేపథ్యంలో ఆదివారం ఆయన స్థానిక కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ ఉద్యమ కార్యాచరణతో పాటు సమైక్య వేదిక కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని కోరారు. బంద్‌కు మద్దతుగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ బాధ్యత వైఎస్సార్‌సీపీపైనే అధికంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వైఖరిని ఎండగట్టాలని, ఆ రెండు పార్టీల నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఏనాడు ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండా పాలన సాగించారన్నారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేసే పనులు ఆయన ఏనాడూ చేయలేదన్నారు.
 
 తెలుగువారి ఆత్మగౌరవాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలను అవమానపర్చొదని కాంగ్రెస్ నేతలనుద్దేశించి అన్నారు.  కేంద్రంలోని కొందరు మంత్రులు, ఎంపీలు రాజీనామాల విషయంలో ఇప్పటికీ మాయమాటలతో తప్పించుకోవడం శోచనీయమన్నారు. ఉద్యమ తీవ్రత పెరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని.. వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement