ఎర్రకాలువ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో నాగరాజువర్మ హెచ్చరించారు.
నల్లజర్ల, న్యూస్లైన్:
ఎర్రకాలువ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో నాగరాజువర్మ హెచ్చరించారు. మగళవారం ఎర్రకాలువ పరిధిలో ఉన్న అనంతపల్లి, పోతవరం, కవులూరు ఇసుక ర్యాంపుల్లో దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తు న్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేయగా, మరో 9 ట్రాక్టర్లను, ట్రక్కులను వాటి యజమానులు కాలువలో వదిలి పరారయ్యారు. గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్ ఆధ్వర్యంలో ట్రక్కుల వద్ద కాపలా ఉంచినట్టు అధికారులు తెలిపారు.
సీజ్ చేసిన ట్రాకర్ల యజమానులు 15 రోజుల్లో జరిమాన చెల్లించాలని, లేనిపక్షంలో ట్రాక్టర్లను కోర్టుకు అప్పగిస్తామని వారు తెలిపారు. వదిలి వెళ్లిన 9 ట్రాక్టర్ల యజమానులు అధికారులను సంప్రదించకపోతే రవాణ శాఖ ద్వారా వారి వివరాలు సేకరించి కోర్టు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎర్రకాలువ నుంచి ఇసుక అక్రమ రవాణ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో లారీలపై ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని వీటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇసుక అక్రమ రవాణ చేసిన వారి వివరాలు అధికారుల దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ దాడుల్లో డీఎల్పీవో రాజ్యలక్ష్మి, ఏపీడీ శ్యామ్యూల్, ఏఎస్సై ప్రకాశరావు, కార్యదర్శి కొండలరావు పాల్గొన్నారు.