ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభానికి సిద్ధం

IIIT Classes Start In Prakasam District - Sakshi

ముస్తాబవుతున్న రావ్‌ అండ్‌ నాయుడు కళాశాల 

సాక్షి, ఒంగోలు: జిల్లాకు చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు శుభవార్త. నాలుగో బ్యాచ్‌కు చెందిన జిల్లా విద్యార్థులు ఒంగోలులోనే ఉండి చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటీ తరగతులు ఒంగోలులో ప్రారంభం కానుండటంతో వాటికి సంబంధించి ప్రాంగణాన్ని, భవనాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీ కాలేజీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ దాని ప్రత్యేకత తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 2016–2017 విద్యా సంవత్సరంలో ఒంగోలుకు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ మంజూరైంది. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ట్రిపుల్‌ ఐటీగా దానికి పేరు పెట్టారు. ఒంగోలుకు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ మంజూరైనప్పటికీ అందుకు సంబంధించిన కాలేజీ భవనాలు, ఇతర సౌకర్యాలు ఇక్కడ లేకపోవడంతో దానిని ఇడుపులపాడుకు తరలించారు.

జిల్లాకు చెందిన మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఇడుపులపాడులోనే ట్రిపుల్‌ ఐటీ చదువుకుంటూ ఉన్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి నాలుగో బ్యాచ్‌ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒంగోలులోనే ట్రిపుల్‌ ఐటీ తరగతులు నిర్వహించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ప్రతిపాదిత ప్రాంతమైన రావ్‌ అండ్‌ నాయుడు ఇంజనీరింగ్‌ కాలేజీ భవనాలను సిద్ధం చేశారు.  కొంతకాలంగా ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ వెంకట్రావు ఒంగోలులోనే మకాం వేసి కాలేజీకి సరిపడే సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

ముహూర్తం ఖరారు..
ఒంగోలు శివారులోని రావ్‌ అండ్‌ నాయుడు ఇంజనీరింగ్‌ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ప్రస్తుత విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్‌ తరగతులను ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల్లోపు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్‌గాందీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ ఛాన్సలర్‌ కేసీ రెడ్డి తరగతుల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు తమకు అందుబాటులోనే ఉన్నత విద్యను అభ్యసించనున్నారన్న ఆనం దం ఆ తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top