లారీని ఆటో ఢీకొని ముగ్గురు..
బైక్ అదుపు తప్పి ఒకరు..
ఆటో–బైక్ ఢీకొని మరొకరు మృతి
సంతమాగులూరు (అద్దంకి): ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. అందరూ పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వారు. మృతుల్లో దావులూరి ఏడుకొండలు (50), ముండ్రు రవణమ్మ (52) అక్కడికక్కడే మృతిచెందగా, ఎలవర్తి సుబ్బులు (70) నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయింది. తీవ్రగాయాలైన బోయపాటి అనూరాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ చికిత్స పొందుతున్నారు. డి.చిన్న యోగమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సంతమాగులూరు ఎస్ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాళ్లగుట్టలపైకి దూసుకెళ్లి..
మర్రిపూడి మండలం రాజుపాలెం సమీపంలో రాళ్ల గుట్టలపైకి బైక్ దూసుకెళ్లిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన గ్రానైట్ క్వారీ డంపింగ్ ఆపరేటర్ చిన్న బసప్ప (51) మృతి చెందాడు. బసప్ప తన స్నేహితుడు పాపత్తు బల్లూరెడ్డితో కలిసి కనిగిరి మండలం ఎనిమిరెడ్డిపల్లిలో జరిగిన పోలేరమ్మ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ రాజుపాలెం సమీపంలోని హైవేపై ఉన్న రాళ్ల గుట్టలను గమనించకుండా బైక్ నడపడంతో అదుప#తప్పింది. ఈ ఘటనలో చిన్న బసప్ప అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన బల్లూరెడ్డిని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. మరోవైపు ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మ«ద్యప్రదేశ్కు చెందిన దయాకర్ జైస్వాల్ (44) మృతి చెందిన ఘటన మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీ సిద్దారెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.


