నీవు లేక నేను లేను.. | husband commits suicide after death of his wife in chittore | Sakshi
Sakshi News home page

నీవు లేక నేను లేను..

Jul 27 2017 6:57 AM | Updated on Nov 6 2018 8:08 PM

అనాథలైన  చిన్నారులు (ఇన్‌ సెట్‌లో‌) - Sakshi

అనాథలైన చిన్నారులు (ఇన్‌ సెట్‌లో‌)

ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మృతిని అతను జీర్ణించుకోలేకపోయాడు.

♦ భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య 
♦ అనాథలైన చిన్నారులు
 
వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారికి మొదట ఒక కొడుకు పుట్టాడు. రెండో సంతానమూ మగ బిడ్డ పుట్టడంతో ఆ దంపతులు సంబరపడ్డారు. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. విధి వక్రించడంతో అనారోగ్యం బారిన పడి భార్య మృతిచెందింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మృతిని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం తనకూ వద్దని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హృదయ విదారకమైన ఈ సంఘటన చిత్తూ జిల్లా చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో బుధవారం చోటు చేసుకుంది. 
 
చంద్రగిరి: కొండ్రెడ్డి కండ్రిగ పంచా యతీ  ఎస్టీ కాలనీకి చెందిన వెంకటరమణ(26), రేణుక(23) దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగి స్తున్నారు. వారికి ఏడాదిన్నర క్రితం కొడుకు పవన్‌కుమార్‌ జన్మించాడు. రెండోసారి గర్భం దాల్చిన రేణుక మూడు నెలల క్రితం చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిలో పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ కొడుకులు పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలను ప్రయోజకులను చేయాలని భావించారు.
 
ఈ తరుణంలో రేణుక ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రేణుక ఆరోగ్యం విషమించడంతో వెంకటరమణ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు అధికంగా జన్ని రావడంతో మంగళవారం అర్ధరాత్రి ఇంటి వద్దే మృతి చెందింది. 
 
భార్య లేని బతుకు వద్దని..
ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మృత్యువాత పడటంతో వెంకటరమణ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకూ వద్దని బుధవారం తెల్ల వారుజామున విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్ద రూ ఒకే రోజు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. చిన్నారులు పవన్‌ కుమార్, యశ్వంత్‌ అనాథలుగా మారారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.
 
ఆ దంపతులకు  గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహిం చారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని ఉప సర్పంచ్‌ విజయ్‌శేఖర్‌రెడ్డి తెలిపారు. దీనిపై వివరణ కోసం పీహెచ్‌సీ డాక్టర్‌ కల్యాణ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement