హుద్‌హుద్‌ సాయం.. అందని వారెందరో?

Hud hud Cyclone Effected Victims Did not Get Exgratia - Sakshi

హుద్‌హుద్‌ తుపాను వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తి కావచ్చినా నేటికి నిలువ నీడలేక పరాయి పంచన కాలం గడుపుతున్న వారెందరో ఉన్నారు. హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతూ..నే ఉన్నాయి. మరో వైపు తుపాన్‌ దెబ్బకు ధ్వంసమైన వంతెనలు, రోడ్లు నేటికి వెక్కిరిస్తూనే ఉన్నాయి. వేల కోట్లల్లో నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చినా అందిన సాయం మాత్రం అంతంత మాత్రమే. ఒక్క విశాఖ జిల్లాలోనే 1,46,799 ఇళ్లు దెబ్బ తిన్నట్టు లెక్క తేల్చిన అధికారులు 1,30,993 మందికి మాత్రమే పరిహారం అందించగలిగారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన 15,219 మందికి ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించినా చివరకు 4483 ఇళ్లకు మాత్రమే పరిపాలనామోదం ఇచ్చారు. కానీ వాటి నిర్మాణం నేటికి పూర్తి కాని దుస్థితి నెలకొంది.

పరిహారం అందని వారు వేలల్లో
ఇక పంటల విషయానికి వస్తే 32,167 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతినగా 1,52,806 మందికి రూ.46.46కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా..1,52,225 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 593 మందికి రూ.30 లక్షల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. 61,618 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 1,94,038 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా 1,88,382 మందికి రూ.143.72కోట్ల పరిహారం ఇచ్చారు. ఇంకా రూ.18కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. 2487 మంది పాడి రైతులకు రూ.19.38కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 2264 మందికి రూ.18.63 కోట్లే ఇచ్చారు. 223 మందికి రూ.75లక్షల çపరిహారం అందనేలేదు. బోట్లు, తెప్పలు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ.49.69 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.6.95కోట్లు మాత్రమే 3850 మందికి ఇవ్వగలిగారు. ఇలా దాదాపు ప్రతిశాఖలోనూ పరిహారం అందని వారు లెక్కకు మించే ఉన్నారు. తిరిగి తిరిగి వేసారి విసిగిపోయారు.

నష్టం రూ.వెయ్యి కోట్లు.. ఇచ్చింది రూ.346 కోట్లు 
రంగాల వారీగా చూస్తే ఏపీఈపీడీసీఎల్‌కు అత్యధికంగా రూ.498.95 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత జీవీఎంసీకి రూ.66.79 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.59.81 కోట్లు, విద్యా శాఖకు రూ.29.41 కోట్లు, అటవీ శాఖకు రూ.28.81  కోట్లు, ఏపీఎంఎస్‌ఐడీసీకి రూ.19.50 కోట్లు, జూపార్కుకు రూ.17.37 కోట్లు, సిటీ పోలీస్‌ కమిషనరేట్‌కు రూ.16.10కోట్లు, వుడాకు రూ.10.26 కోట్లు, ఆర్‌అండ్‌ బీకి రూ.9.71 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.9.18కోట్లు, కశింకోట ఆర్‌ఈ సీఎస్‌కు రూ.9 కోట్లు, ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.4.54 కోట్లు ఇలా వివిధ శాఖలకు రూ.వెయ్యికోట్లకు పైగా నష్టం వాటిల్లితే ప్రభుత్వం విదిల్చింది మాత్రం రూ.346 కోట్లు మాత్రమే.  

పరిహారం పక్కదారి  
తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుద్‌హుద్‌ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్‌ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు.

గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.   

తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుద్‌హుద్‌ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్‌ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు. గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.  
 
తుపాను దెబ్బకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న యంత్రాలకు కాకుండా మరో రూ.200 కోట్లు కనీస నష్టాలు వాటిల్లాయి. ఇక హెచ్‌పీసీఎల్‌కు రూ.108 కోట్ల నష్టం వాటిల్లింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌కు సైతం రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ  కేంద్రం నుంచి వీటిలో ఏ ఒక్క పరిశ్రమకు పైసా పరిహారం దక్కలేదు. హిందుస్థాన్‌ షిప్‌ యార్డుకు రూ.450కోట్ల నష్టం వాటిల్లగా బీమా ద్వారా వచ్చింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top