కందుకూరు పట్టణంలోని పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైన ఇళ్లపట్టాల జాబితా తప్పుల తడకగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కందుకూరు, న్యూస్లైన్: కందుకూరు పట్టణంలోని పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైన ఇళ్లపట్టాల జాబితా తప్పుల తడకగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలు ఇళ్లపట్టా దక్కుతుందో?లేదోనని ఆందోళన చెందుతున్నారు. కందుకూరు పట్టణంలో సుదీర్ఘ కసరత్తు, విచారణ తర్వాత 1400 మందికి ఇళ్లపట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే జాబితాలో అనర్హుల పేర్లు సైతం భారీగా చోటుచేసుకున్నాయని ప్రచారం సాగడంతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారు.
తహసీల్దార్లే నేరుగా విచారణ చేసినా..
కందుకూరు పట్టణ పరిధిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం సేకరించిన జనార్దనస్వామి దేవస్థానం భూముల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం తర్వాత మిగిలిన భూమిలో పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ స్థలాన్ని పూర్తిగా చదును చేసి లేఅవుట్ను సైతం సిద్ధం చేసే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని అన్ని వార్డులకు చెందిన 4946 మంది అర్జీలు అందజేయగా, 19 మంది తహసీల్దార్ల నేతృత్వంలో దరఖాస్తుల విచారణను చేపట్టిన రెవెన్యూశాఖ చివరికి 1409 మంది అర్హులని తేల్చింది. వారికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది. అయితే ఆ జాబితాలో అనర్హులే అధికంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికారులు తయారు చేసిన జాబితాలో ఇప్పటికే ఇల్లు ఉన్నవారితో పాటు, కొన్నివార్డుల్లో ఒక కుటుంబంలోని సభ్యులందరి పేర్లు జాబితాలో ఉండటం గమనార్హం. ఇక అర్హుల జాబితాలో లబ్ధిదారుల చిరునామా, ఇతర వివరాలు లేకుండా కేవలం పేర్లను మాత్రమే నమోదు చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జాబితాలో ఆయా పేర్లతోపాటు ఇంటినంబరు, వార్డు పేరు తదితర వివరాలు ఉంటే లబ్ధిదారులను ఇతరులు ఎంతో సులువుగా గుర్తించే అవకాశం ఉండగా, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
ఓ కుటుంబంలోని సభ్యులందరికీ పట్టాలు..
ఉదాహరణకు ఒక వార్డు లబ్దిదారుల జాబితాను పరిశీలిస్తే అందులో డబ్ల్యుఎపి088301300165 నంబర్గల రేషన్కార్డుపై సీరియల్ నంబర్ 46 కింద కుటుంబ యజమాని పేరుపై పట్టా మంజూరు కాగా, అదే కార్డునంబర్తో సీరియల్ నంబర్లో 99 కింద భార్య పేరును జాబితాలో చేర్చారు. ఇలా 15వ వార్డులో అయితే ఏకంగా ఒకే కుటుంబంలోని నలుగురి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండటం గమనార్హం. అదేవార్డులో ఓ రెండు అంతస్తుల భవన యజమానిని పేదల కింద ఇంటిపట్టా పొందేందుకు అర్హుడని అధికారులు తేల్చారు. సొంత ఇల్లు కలిగి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన ఓ మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పేరు కూడా ఇళ్లపట్టాల పంపిణీ జాబితాలో ఉండటం కందుకూరు అధికారుల లీలలకు నిదర్శనం. ఇలా ప్రతివార్డులో పదుల సంఖ్యలో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్న విషయం తెలుసుకుని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇళ్లపట్టాలు దక్కుతాయన్నది అనుమానమేనని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..
రెవెన్యూ శాఖ రూపొందించిన ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాపై వస్తున్న ఫిర్యాదులతో ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 19 మంది తహ సీల్దార్లు విచారణ చేసినా, అర్హుల ఎంపిక ఇంత లోపభూయిష్టంగా ఉండటంపై తలపట్టుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీల కారణంగానే లబ్ధిదారుల జాబితా తప్పులతడకగా మారిందనేది నిర్వివాదాంశం. ఇక పట్టణంలో 2, 3వార్డులకు సంబంధించి ఉప్పుచెరువు, జనార్దన కాలనీల్లో చాలామంది చెరువు భూములను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నవారే. ఈ రెండు వార్డుల్లో ఆరుగురు తహసీల్దార్లు విచారణ చేసి 468 మంది అర్హులను గుర్తించగా, వారిలో గతంలో ఇళ్లపట్టాలు పొందినవారి పేర్లు అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇక లబ్ధిదారుల జాబితాలో అద్దంకి, కావలి, మేదరమెట్ల, నెల్లూరు జిల్లాలకు చెందిన వారి పేర్లు సైతం ఉండటం మంత్రి మానుగుంట మహీధర్రెడ్డి ఇలాకా పేదల అభ్యున్నతిపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఈ లబ్ధిదారుల జాబితాపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈనెల నాలుగో తేదీన మంత్రి మహీధర్రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. మళ్లీ ఈ జాబితాపై రీసర్వే చేసే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే 90 పేర్లు తొలగించాం: టి బాపిరెడ్డి, ఆర్డీఓ
ఇళ్ల పట్టాల పంపిణీకి తయారు చేసిన లబ్ధిదారుల జాబితాలో అనర్హులను గుర్తిస్తున్నాం. ఇప్పటికే 90 మంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాం. స్థలాలు ఇప్పిస్తామంటూ దళారుల చెప్పే మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దు. అనర్హుల సమాచారం తెలియజేస్తే వారి పేర్లను తొలగించి, అర్హులకే స్థలాలు పంపిణీ చేస్తాం.