రైల్వేజోన్పై ఎందుకీ అలసత్వం?
రైల్వేశాఖను నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న అలసత్వంపై హైకోర్టు మంగళవారం రైల్వేశాఖను నిలదీసింది. అపాయింటెడ్ డే నుంచి ఆరు నెలల్లోపు రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చెబుతుంటే, ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది.
రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో తీసుకున్న చర్యలేమిటో వివరించాలని రైల్వేశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.