అధిక ధరలపై ఏం చేస్తారో చెప్పండి
టీటీడీ ఈవోకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుమలలో అధిక ధరలకు తినుబండారాలు, ఇతర వస్తువులను విక్రయించే వ్యాపారులపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం తిరుమల, తిరుపతి దేవస్థానాల(టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో)ని ఆదేశించింది. అదేవిధంగా భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఏం చేయబోతున్నారో తెలియచేయాలని హోటళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
అధిక ధరలపై ఫిర్యాదులు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని, ఒకవేళ ఇప్పటికే ఉంటే ఆ నంబర్ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని టీటీడీకి తేల్చి చెప్పింది. వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే యంత్రాంగం ఏదైనా ఏర్పాటు చేశారో లేదో తెలియచేయాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.