‘మహీంద్రా’లో హరీష్ ఘన విజయం | great win of harish in mahendra | Sakshi
Sakshi News home page

‘మహీంద్రా’లో హరీష్ ఘన విజయం

Dec 29 2013 2:49 AM | Updated on Oct 8 2018 7:58 PM

జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా మినీ ట్రక్కుల తయారీ కర్మాగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంఎస్ అభ్యర్థి, టీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు గెలుపొందారు.

జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా మినీ ట్రక్కుల తయా రీ కర్మాగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంఎస్ అభ్యర్థి, టీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు గెలుపొందారు. సీఐటీయూ తరఫున పోటీ చేసిన సీపీఎం నేత చుక్కా రాములుపై 41 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గత మూడు సార్లు సీఐటీయూ గెలుపొందింది. నాలుగోసారి కూడా విజయం సాధించేందుకు తీవ్రంగా కృషిచేసినా ఓటమి తప్పలేదు. మొత్తం ఓట్లు 382 ఉండగా 377 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలంగాణ మజ్దూర్‌సంఘ్ తరఫున పోటీ చేసిన హరీష్‌రావుకు 209 ఓట్లు, సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్క రాములుకు 168 ఓట్లు పోల్ అయ్యాయి. గత ఎన్నికల్లో సైతం హరీష్‌రావు, చుక్కా రాము లు పోటీ పడ్డారు. చుక్కా రాములు 64 ఓట్ల మెజార్టీతో హరీష్‌రావుపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం హరీష్‌రావు చేతిలో చుక్కా రాములుకు ఓటమి తప్పలేదు.
 టీఎంఎస్, టీఆర్‌ఎస్ సంబరాలు..
 హరీష్‌రావు గెలుపొందడంతో టీఎంఎస్ కార్మికులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు హరీష్‌ను పూలమాలలతో ముంచెత్తారు. డ్యాన్స్ లు చేస్తూ కేరింతలు కొట్టారు. జై తెలంగాణ అంటూ నినదించారు.
 ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం..
 మహీంద్రాలో గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలుపుకుంటామని హరీష్‌రావు స్పష్టం చేశారు. మంచి అగ్రిమెంట్ సాధించడమే కాకుండా కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  మభ్య పెట్టాలని ప్రయత్నించిన సీఐటీయూ నాయకుల కల్లబొల్లి మాటలను కార్మికులు నమ్మలేదన్నారు.
 వచ్చే ఎన్నికలకు విజయ సూచిక
 మహీంద్రా కర్మాగారంలో టీఎంఎస్ సాధించిన విజయం వచ్చే సాధారణ ఎన్నికలకు విజయసూచికగా హరీష్‌రావు అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలనూ కైవ సం చేసుకుంటామన్నారు. తెలంగాణ వాదం బలంగా ఉందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. అనంతరం విజ యోత్సవ ర్యాలీ నిర్వహించారు. సంబ రాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, టీఎంఎస్ నేత నర్సింహా రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు గౌని శివకుమార్, చింతా ప్రభాకర్, డి.లక్ష్మారెడ్డి, యాకూబ్, భీంసింగ్, నామ రవికిరణ్, సాయికుమార్, ఆశప్ప పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement