ఏరోస్పేస్ రంగంలో భారతీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దూసుకుపోతున్నట్లు చెప్పింది. విమానాల తయారీలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న సరఫరా-గొలుసు (సప్లై-చైన్) లోపాలను అధిగమించడానికి, గ్లోబల్ ఏరోస్పేస్ మార్కెట్లో వ్యూహాత్మక కొనుగోళ్లు జరపడంపై కంపెనీ దృష్టి సారించింది. ఈ విషయాన్ని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా విమాన డెలివరీలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సప్లై-చైన్ నెట్వర్క్లో తలెత్తుతున్న అంతరాయాలేనని కంపెనీ చెప్పింది. ఈ అడ్డంకులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎం) మహీంద్రా గ్రూప్ను సంప్రదించారని అనీష్ షా స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన కంపెనీ ఆదాయాల వెల్లడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం గ్లోబల్ ఓఈఎంలు కేవలం ఆర్డర్ల కోసమే కాకుండా మా సామర్థ్యాన్ని నమ్మి వస్తున్నాయి. మేము అత్యుత్తమ నాణ్యతను అందిస్తామని, మా ఉత్పాదక పరిధిని మరింత విస్తరించమని కోరుతున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు సరఫరా పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’ అన్నారు. పరిశ్రమ వర్గాల విశ్లేషణల ప్రకారం.. అనీష్ షా పేర్కొన్న ఆ గ్లోబల్ ఓఈఎం.. అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం ఎయిర్బస్ అనేలా అంచనాలున్నాయి. గత కొద్దికాలంగా మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్తో ఎయిర్బస్ తన వ్యాపారం భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.
ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి


