అభిమానం వెల్లువ | grand welcome to ys jagan | Sakshi
Sakshi News home page

అభిమానం వెల్లువ

Feb 26 2016 4:42 AM | Updated on Jul 25 2018 4:07 PM

అభిమానం వెల్లువ - Sakshi

అభిమానం వెల్లువ

ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..

రోజంతా బిజీబిజీగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
వివాహాలు, పరామర్శలు, నూతన జంటలకు ఆశీర్వాదం
కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ
ఎర్రగుంట్ల, బద్వేలు, పోరుమామిళ్లలో ఘన స్వాగతం
అడుగడుగునా కాన్వాయ్‌ని ఆపి.. కరచాలనం చేసిన అభిమానులు
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామంటూ నేతలు, కార్యకర్తలకు భరోసా
పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మాటా మంతి

 
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ.. కార్యకర్తల పట్ల అభిమానాన్ని చాటుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు సాగారు. పండుటాకులపై ప్రేమ కురిపిస్తూ.. అడుగడుగునా అభిమానులు కాన్వాయ్‌ని ఆపుతున్నా ఏమాత్రం విసుగు చెందకుండా అందరినీ ఆప్యాయంగా పలుకరించారు.  
 
కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నాటి జిల్లా పర్యటనలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన పర్యటనలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడప, ఎర్రగుంట్ల, మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, ఆలంఖాన్‌పల్లె ఇలా అన్నిచోట్ల వేలాది మంది జనానికి అభివాదం చేస్తూ.. అభిమానులతో కరచాలనం చేస్తూ.. వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆయన ముందుకు సాగారు. వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు.

ఆశీర్వాదాలు.. పరామర్శలు
ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్న నేపధ్యంలో గురువారం ఉదయాన్నే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎర్రగుంట్లలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పోట్లదుర్తికి వెళ్లి ఇటీవలే వివాహమైన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు మహేంద్రనాథ్‌రెడ్డి, కీర్తిలతలను ఆశీర్వదించారు. ఆ తర్వాత చాపాడు మండలంలోని నాగులపల్లెకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి వెళ్లారు. ఇటీవలే వివాహమైన మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి కుమారుడు విద్యాసాగర్‌రెడ్డి, మౌనికలను ఆశీర్వదించారు. అట్లూరు వైఎస్సార్ సీపీ నాయకుడు గోవిళ్ల చిన్న సూరారెడ్డి కుమారుడు ఆదిత్యనాథ్‌రెడ్డి వివాహం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో బద్వేలులోని వారి ఇంటికి వెళ్లారు. ఆదిత్యను ఆశీర్వదించారు. అనంతరం పోరుమామిళ్లలోని ఎంపీపీ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత మహిళా ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్ పర్సన్ క ృష్ణమ్మ, ఆమె కుమారుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. (ఇటీవలే క ృష్ణమ్మ భర్త పోతిరెడ్డి భాస్కర్‌రెడ్డి మృతి చెందారు) అనంతరం ఆలంఖాన్‌పల్లెలో చెన్నూరు వైఎస్సార్‌సీపీ నేత రాజేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల వారు గ ృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. కడప నగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మిదేవి, వీరారెడ్డిల కుమారుడు బ్రహ్మనందరెడ్డి, శివకుమారిలను (ఇటీవలే వివాహం అయ్యింది) ఆశీర్వదించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ తల్లి రెడ్డెమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు ఇంటికి వెళ్లి ఇటీవలే వివాహమైన కుమార్తె ప్రియాంక, అల్లుడు శ్రీకాంత్‌రెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం హజరత్ మౌలానా సయ్యద్‌షా యూసుఫ్ బొగ్దాది సాహెబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పెద్దదర్గాకు వెళ్లి ఉరుసు ఉత్సవంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ముస్లిం మైనార్టీలు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. అక్కడి నుంచి నేరుగా వైఎస్ జగన్ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త, దివంగత సీఎం వైఎస్ తోడల్లుడు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు.
 
 అడుగడుగునా కాన్వాయ్‌ను ఆపి కరచాలనం
 పులివెందుల నుంచి కడప వరకు బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా వస్తున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేత కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేశారు. వ ృద్దులు, యువకులు, మహిళలతోపాటు చాలాచోట్ల చిన్నారులు కూడా వైఎస్ జగన్‌ను పలుకరించారు. అన్ని గ్రామాల్లో స్థానికులు రోడ్డుపైకి వచ్చి జగన్‌తో కరచాలనం చేసేందుకు కాన్వాయ్‌ను ఆపుతూ వచ్చారు. దీంతో పర్యటన ఆలస్యంగా సాగింది.
 
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెంట ఉండగా, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనంతపురం జిల్లా కదరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు సుధీర్‌రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, వేల్పుల రాము, బద్వేలు నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వైఎస్ జగన్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement