కల్తీకల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనను వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ
గోకవరం : కల్తీకల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనను వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో కల్తీకల్లు తాగి మృతి చెందిన నాగులపల్లి దుర్గారావు, దాకారపు శ్రీను కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా రూ. పది వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చూస్తే ఇవి ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వ లోపభూయిష్టం, ఎక్సైజ్శాఖ అనాలోచిత విధానం వ ల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల సొసైటీ నిర్వహణ లేకపోవడం, ఎక్సైజ్శాఖ అధికారులు బాధ్యతలు, విధివిధానాలు గుర్తెరగకపోవడం వలన కల్తీకల్లు నిరోధించలేక రాష్ట్రంలో తరచూ ఈ సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
బాధిత కుటుంబాల పరిస్థితి రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితని, వీరి కుటుంబాల్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. పది లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి బోసుబాబు, పార్టీ నాయకులు జనపరెడ్డి బాబు, వరసాల ప్రసాద్, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు మొగలి వెంకటరమణ, చింతల సత్యవాణి, మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, సెక్రటరీ కర్రి సూరారెడ్డి తదితరులు ఉన్నారు.
చిచ్చు పెట్టే యత్నాలు వద్దు
గోకవరం : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పార్టీ పరంగా జరిగిన రేవంత్రెడ్డి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్కదారి పట్టిస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. గోకవరంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవలి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు రూ.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారని, కానీ రాష్ట్రంలో బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి ఉదంతానికి చంద్రబాబు బాధ్యత వహించాలే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడం తగదని, హితవు పలికారు.