ఇక ‘పుర’ పోరే...!

Get Ready For Municipal Elections In Srikakulam - Sakshi

సర్వం సిద్ధంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలు

రాజాంలో ఈసారి కూడా ఎన్నికలు లేనట్లే...!

వైఎస్సార్‌సీపీదేనా హవా..

సాక్షి, అరసవల్లి: మరో ఆరు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మిగిలింది మున్సిపల్‌ ఎన్నికల పోరే. ఇందుకోసం ఓటర్ల జాబితాల ప్రచురణ ఇప్పటికే పూర్తికావడంతో తదుపరి చర్యల్లో పురపాలక అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కులాల వారీగా ఓటర్ల గుర్తింపు, జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల శాతాల ప్రకారం వార్డుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు తదితర చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ మళ్లీ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి.

జిల్లాలో పరిస్థితి ఇది
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీని 2015లో కార్పొరేషన్‌ హోదాను, అలాగే రాజాం మేజర్‌ పంచాయతీని 2005లో నగర పంచాయతీగా హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. గత పుర ఎన్నికల్లో ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో పాలక సభ్యుల పాలన కొనసాగుతోంది. వచ్చే జూలై వరకు ఈ పాలనకు గడువుంది. అయితే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీన వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడటంతో ఈసారి తొలిసారిగా ఎన్నికలకు ముస్తాబవుతోంది. వాస్తవానికి శ్రీకాకుళం పట్టణానికి 3 లక్షల మంది జనాభా ఉంటేనే కార్పొరేషన్‌ హోదా ఇవ్వాల్సి ఉంది. అయితే పట్టణానికి సమీపంలో కాజీపేట, కిల్లిపాలెం, చాపురం, పాత్రునివలస, పెద్దపాడు, తోటపాలం, కుశాలపురం పంచాయతీలను విలీనం చేస్తారని అంతా భావించారు.

ఇవి విలీనం చేసినా.. ఇప్పుడున్న 1.25లక్షల మంది జనాభాకు మరో 80 వేల నుంచి లక్ష మంది వరకు జనాభా పెరిగే అవకాశముంది. అయితే తాజాగా పరిస్థితులు చూస్తుంటే విలీన ప్రతిపాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా కన్పిస్తోంది. పైగా ఎన్నికల సంఘం అధికారులు కూడా కేవలం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో ఓటర్ల జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రచురణ చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు ఈ నెల 20న జిల్లాలో 1143 పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. ఇందులో విలీన ప్రతిపాదనలో ఉన్న ఈ ఏడు పంచాయతీల్లో కూడా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. దీంతో ఈసారికి విలీన ప్రతిపాదనలు లేనట్లే అన్న భావన వ్యక్తమవుతోంది.

రాజాంలో నాల్గో ‘సారీ’.....!
జిల్లాలో ప్రముఖ వ్యాపార, వాణిజ్య పట్టణమైన రాజాం నగర పంచాయతీకి ఈ దఫా కూడా ఎన్నికలు లేనట్లే అని తేలిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు చర్యలకు దిగారు. ఈ మేరకు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పనులు పూర్తి చేసి వార్డుల రిజర్వేషన్లపై దృష్టిసారించారు. అయితే ఒక్క రాజాం నగర పంచాయతీలో మాత్రం మళ్లీ ఎన్నికల కల నెరవేరలేదు.

2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించిన రాజాంలో సమీప పంచాయతీల విలీన ప్రక్రియే ఇందుకు ప్రధాన కారణమయ్యింది. రాజాం మండలంలోని రాజాం, సారధి మేజర్‌ పంచాయతీలు, కొత్తవలస పంచాయతీతోపాటు సంతకవిటి మండల పరిధిలోని పొనుగుటివలస, కొండంపేట పంచాయతీల విలీన ప్రక్రియపై కోర్టులో వివాదం నడుస్తోంది. దీంతో ఆవిర్భావం నుంచి అంటే 2005, 2010, 2015లలో మున్సిపల్‌ ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. తాజా పరిస్థితులు అలాగే ఉండడంతో 2019లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.

ధీటైన అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు
రానున్న పురపోరులో బలాబలాలు తేల్చుకునేందుకు జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈసారి సాధారణ ఎన్నికల్లో సత్తా చూపనున్న వైఎస్సార్‌సీపీ, స్థానిక ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలన్న ఊపులో ఉంది. ఇందుకోసం ధీటైన అభ్యర్థులను సన్నద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకమైన కార్యకర్తల సేవను గుర్తించాలని అధిష్టానం నిర్ణయించడంతో వారిలో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రూరల్‌ ప్రాంతాలతోపాటు అర్బన్‌ ప్రాంతాల్లోనూ హవా చూపిందన్న అంచనాలున్న నేపథ్యంలో ‘పుర’ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించడం ఖాయమనేలా రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే గత స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ ఈసారి మాత్రం కంగుతిననుంది.

తాజాగా సాధారణ ఎన్నికల్లోనూ ఆపార్టీకి గెలిచే అవకాశాలు లేకపోవడంతో డీలా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలితోపాటు స్థానికంగా ఐదేళ్లపాటు పట్టించుకోని అధికార పార్టీ అగ్రనేతల శైలి కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి రగిలిస్తోంది. అయితే ఎన్నికలు రానున్న నేపథ్యంలో బరిలో నిలవాలన్న కారణంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థులను ఇంకా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీకి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరనే ప్రచారం జోరందుకుంది. దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రభావం నామమాత్రమే అని ఆదిలోనే స్పష్టమవుతోంది.

ఓటర్ల జాబితాలిలా....

 పుర కేంద్రం  పుర కేంద్రం  మొత్తం ఓటర్లు
శ్రీకాకుళం కార్పొరేషన్‌ 50 డివిజన్లు 1,13,356
పాలకొండ నగర పంచాయతీ 20 వార్డులు 20,701
ఆమదాలవలస మున్సిపాలిటీ 23 వార్డులు 32,646
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 25 వార్డులు 43,821
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 23 వార్డులు 27,831

ఎన్నికల్లో ఘన విజయం కోసం..
స్థానిక కార్పొరేషన్‌ తొలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి అందరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు 50 డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షించారు. 2015లో కార్పొరేషన్‌ హోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఆ పార్టీ స్థానిక నేతల అక్రమాలు, దందాలపై నగర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఈసారి గట్టిగా బుద్ధి చెప్పనున్నారు. జగనన్నకు మా ఈ ‘స్థానిక’ ఘన విజయాలను కానుకగా అందిస్తాం.
– అంధవరపు సూరిబాబు, నగర పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, శ్రీకాకుళం

మరింతగా ప్రజాపాలన అందిస్తాం..
గత ఎన్నికల్లో ఘనంగా గెలిచినప్పటికీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పలేదు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్ల సహకారంలో నిత్యం ప్రజల్లో ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ వల్ల పురజనులకు ఇబ్బందులు పెట్టినప్పటికీ వారి కోసం గట్టిగా పోరాడాం. మళ్లీ పురపాలక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం. ఈసారి జగనన్న సీఎం కాబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రజలకు మరింత దగ్గరగా ప్రజాపాలన అందించేందుకు కృషి చేస్తాం.
– పిలక రాజ్యలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్, ఇచ్ఛాపురం

గెలుపు గ్యారంటీ...
రానున్న స్థానిక ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాం. ఎమ్మెల్యే అ«భ్యర్థి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ అగ్రనేతల సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికను చేపడతాం. ప్రజల్లో నిత్యం ఉండే నాయకులను పార్టీ గుర్తిస్తుందని విశ్వాసం ఉంది. 25 వార్డుల్లో పరిస్థితులపై ఇప్పటికే దృష్టిపెట్టారు. స్థానికంగా టీడీపీ నేతల దందాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పట్టణ ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నారు. ‘పుర’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా... గెలుపు గ్యారంటీగా పనిచేస్తాం.
– దువ్వాడ శ్రీకాంత్, ఫ్లోర్‌ లీడర్, పలాస మున్సిపాలిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top