స్వేచ్ఛకు సంకెళ్లు | Freedom manacles | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛకు సంకెళ్లు

May 22 2016 4:21 AM | Updated on Sep 22 2018 8:22 PM

ఓటమి భయంతోనే అధికార పార్టీ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ బ్యాలెట్‌పై సీరియల్ నంబర్లు ముద్రించి అధికార.....

వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్

నెల్లూరు సిటీ : ఓటమి భయంతోనే అధికార పార్టీ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ బ్యాలెట్‌పై సీరియల్ నంబర్లు ముద్రించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి 36 మంది సభ్యులు ఉండగా, వైఎస్సార్‌సీపీకి 17 మంది ఉన్నారన్నారు. టీడీపీ గెలుపొందేందుకు అవసరమైన ఓట్లు ఉన్నా.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తే అధికారులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇంత చిన్న ఎన్నికకు సీసీ కెమెరాలు, 144 సెక్షన్ విధించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 35 ఓట్లు పోలింగ్.. ఒక కార్పొరేటర్‌కు 34 ఓట్లే!
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సభ్యులు కిన్నెర ప్రసాద్, రాజానాయుడు, దాసరి రాజేష్, షేక్ వహిద, అంచూరు జానకి  గెలుపొందారు. మొత్తం ఓట్లు 54 ఉండగా, వైఎస్సార్‌సీపీ నుంచి 17 మంది కార్పొరేటర్లు ఓటింగ్‌ను బహిష్కరించారు. టీడీపీకి చెందిన బొల్లినేని శ్రీవిద్య అందుబాటులో లేరు. సీపీఎం కార్పొరేటర్ పద్మజ గైర్హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన ఐదుగురులో నలుగురికి 35 ఓట్లు పోలవగా, దొడ్డపనేని రాజానాయుడుకు మాత్రం 34 ఓట్లు పోలయ్యాయి. అయితే రాజానాయుడికి ఓటు వేయని కార్పొరేటర్ ఎవరనే దానిపై అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. నగర మేయర్ అజీజ్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement