
కర్నూలులో జెండా పండుగ
ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలకు కర్నూలు వేదిక కానుంది.
రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణ
- నూతన రాష్ట్రంలో జిల్లాకు సముచిత స్థానం
- టీడీపీ ప్రభుత్వ నిర్ణయం?
- జిల్లా అధికారులకు అందని సమాచారం
- కార్యక్రమానికో జిల్లా చొప్పున ఎంపిక
కర్నూలు(కలెక్టరేట్) : ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలకు కర్నూలు వేదిక కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు కొలిక్కి రావాల్సి ఉంది. అందువల్ల ప్రభుత్వం ఒక్కో కార్యక్రమ నిర్వహణకు ఒక్కో జిల్లాను ఎంపిక చేసుకుంటోంది. టీడీపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక తిరుపతిలో నిర్వహించగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం గుంటూరులో చేపట్టారు.
కేబినెట్ తొలి సమావేశం విశాఖపట్నంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయిన కర్నూలులోనూ ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అసెంబ్లీ సమావేశాలు జిల్లాలో నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దిన వేడుకలను రాష్ట్ర స్థాయిలో కర్నూలులో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మేరకు ప్రకటించినట్లు సమాచారం.
1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని. 1956లో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన తర్వాత రాజధాని హైదరాబాద్కు తరలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో నిర్వహించతలపెట్టడం విశేషం. జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర వేడుకలు కొండారెడ్డి బురుజు పక్కనున్న పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొనే రాష్ట్రస్థాయి వేడుకకు అనువైన మైదానాన్ని ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఎస్ఏపీ క్యాంపు మైదానంలో ఈ వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే కర్నూలులో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగానికి ఎలాంటి సమాచారం అందలేదు. వేడుకలను కర్నూలులో నిర్వహించాలని నిర్ణయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.