
వారంతా గోదావరి నది అందాలను వీక్షిస్తూ.. పాపికొండలు చూడాలని తరలివచ్చారు. మొత్తం 120 మందితో బయలుదేరిన ఆ బోటు అగ్నికీలల్లో చిక్కుకుంది. బోటును అలాగే ఒడ్డుకు చేర్చడంతో పర్యాటకులంతా ఇసుక తిన్నెలపైకి దూకేశారు. కొంతమంది ప్రాణభయంతో తమ బిడ్డలను ముందుగానే ఇసుకలోకి విసిరేశారు. ఈ సంఘటనలో బోటు మొత్తం కాలిపోగా పలువురికి గాయాలయ్యాయి. తృటిలో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం/దేవీపట్నం/రంపచోడవరం: పాపికొండల విహారానికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయల్ గోదావరి బోటు బయలుదేరింది. ఇందులో 90 మంది పెద్దలు కాగా.. 30 మంది పిల్లలున్నారు. వీరంతా బోటు ఎక్కాక గోదావరిలో 2 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేశాక పూడిపల్లి, వీరవరం లంక గ్రామాల మధ్యకు చేరేసరికి బోటులో మంటలు వ్యాపించాయి. కిచెన్ నుంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ సమయంలో బోటు ఇసుక తిన్నెకు దగ్గరగా ప్రయాణిస్తుండడంతో డ్రైవర్ అటువైపునకు బోటును తరలించాడు. దీంతో పర్యాటకులు పసిబిడ్డలను ఇసుకలోకి విసిరేసి తర్వాత తామూ దూకేశారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బోటు మొత్తం దగ్ధమవడంతో కొందరి లగేజీ, నగదు, తదితర సామాగ్రి కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం సంభవించిందని పర్యాటకులు చెబుతుండగా.. బోటు సిబ్బంది, నిర్వాహకులు, అధికారులు మాత్రం జనరేటర్లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. పర్యాటకులందరినీ దేవీపట్నం పోలీస్స్టేషన్కు తరలించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ డా.జి.వినోద్కుమార్ పోలీస్స్టేషన్కు చేరుకుని పర్యాటకులను రాజమహేంద్రవరం పంపించారు.
నిర్లక్ష్యమే శాపం
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. అనుమతుల్లేని లేదా పునరుద్ధరించుకోని బోట్లకు అనుమతిలిచ్చేస్తున్నారు. తాజాగా రాయల్ గోదావరి టూరిజం బోట్లో కేవలం 10 నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. బోటు దేవీపట్నం వైపు ఉన్నా, ఒడ్డులేని ప్రాంతంలో ఉన్నా పెను ప్రమాదం జరిగేది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన 70 బోట్లు పర్యాటకులను తీసుకెళుతున్నాయి. ఏడాది కాలానికి బోటుకి ఫిట్నెస్ సర్టిఫికెట్, బోటు డ్రైవర్లకు లైసెన్సులు, గజ ఈతగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్ 30తో అనుమతుల గడువు ముగిసింది. అయితే నిర్ణీత గడువులోపు 70 బోట్లకుగాను ఒక్క బోటుకే అనుమతి ఉంది. మిగిలిన 69 బోట్ల యజమానులు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో చాంబర్లో శుక్రవారం సాయంత్రం సబ్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఏఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి ఆయన మాట్లాడారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏఎస్పీ అజిత చెప్పారు.
పూర్తిగా దగ్ధమైన బోటు